ఫాస్టాగ్‌ యూజర్లకు కేంద్రం కొత్త స్కీమ్‌

Center launches new scheme for FASTag users;

Update: 2025-06-18 09:26 GMT

సొంత వాహనాల్లో ప్రయాణాలు సాగించే వాళ్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు టోల్ చెల్లింపులు మరింత సులభతరంగా మారనున్నాయి. ఫాస్టాగ్ వినియోగదారుల కోసం ప్రత్యేక వార్షిక పాస్‌ ప్రారంభించనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇది వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి రానుంది.



ఈ వార్షిక పాస్ కోసం వాహనదారులు రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి పాస్‌ను యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఇది ఏడాది పాటు లేదా 200 టోల్ ప్రయాణాలకు చెల్లుబాటు అవుతుంది. ఈ గడువు లోపల ఏది ముందు పూర్తవుతుందో, ఆ సమయంలో పాస్ గడువు ముగుస్తుంది. మొదట దశలో ఇది కేవలం కార్లు, జీపులు, వ్యాన్ల్‌లు వంటి నాన్-కమర్షియల్ వాహనాలకే వర్తించనుంది.



దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జాతీయ రహదారులపై ఈ పాస్‌ను ఉపయోగించుకోవచ్చు. పాస్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు అవసరమైన లింక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ లింక్ రాజ్‌మార్గ్‌ యాప్‌, ఎన్‌హెచ్‌ఏఐ వెబ్‌సైట్‌, మంత్రిత్వ శాఖ అధికారిక పోర్టల్స్‌ ద్వారా అందుబాటులోకి రానుంది.



వాహనదారుల నుంచి ఇలాంటి సౌకర్యంపై ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గడ్కరీ స్పష్టం చేశారు. ఈ కొత్త వ్యవస్థ వల్ల టోల్‌ప్లాజాల వద్ద అనవసర రద్దీ తగ్గుతుందంటున్నారు. అంతేకాకుండా టోల్‌ చెల్లింపులపై వచ్చే వివాదాలు కూడా తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది.




Tags:    

Similar News