Caste Census in Karnataka : కర్నాటక రాష్ట్రంలో రెండో సారి కులగణన
ముఖ్యమంత్రి సిద్దరామయ్య గ్రీన్ సిగ్నల్;
రాష్ట్రంలో మరోసారి కులగణన నిర్వహించాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే సెప్టెంబర్ మాసం 22వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకూ 15 రోజుల పాటు రెండొవ సారి కులగణను చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆధికారులను ఆదేశించారు. కొన్ని నెలల క్రితం కంథరాజు కమిషన్ నేతృత్వంలో కర్నాటక రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టారు. ఈ సర్వేలో ప్రజల నుంచి 54 ప్రశ్నలకు సమాధానాలను రాబ్టారు. అయితే సర్వేలో తమ జనాభాను తక్కువగా చూపించారని కర్నాటకలో ప్రిడామినెంట్ సామాజికవర్గాలైన ఒక్కలిగ, వీరశైవ లింగాయత్ లతో పాటు షెడ్యూల్డ్ కులాల సమాజికవర్గం వాళ్ళు, బలహీన వర్గాలకు చెందిన కులాలు తీవ్ర ఆందోళన చేశాయి. ఈ కులగణనపై అనేక మంది మంత్రులు, శాసనసభ్యులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మొదటి సారి నిర్వహించిన కులగణన పట్ల రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో మరోసారి అత్యంత పారదర్శకంగా కులగణన చేపట్టాలని సీయం సిద్దరామయ్య నిర్ణయించారు. ఆ మేరకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య నివాసంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక భేటీ జరిగింది. కుల గణనతో పాటు నూతన సామాజిక, ఆర్థిక పరిస్ధితులు, విద్యలపై కూడా సమగ్ర సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి ఎటువంటి విమర్శలు రాకుండా ఉండేలా కులగణన నిర్వహించే విధానంపై చర్చించారు. పలువురు మంత్రులు, వెనకబడిన వర్గాల కమిషన్ చైర్మన్ మధుసూదన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మానవ వనరులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, పకడ్బందీగా నిర్వహించాలని సీయం సిద్దరామయ్య అధికారులకు సూచించారు. అక్టోబర్ నెలాఖరుకల్లా సర్వే నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సీయం ఆదేశించారు. అయితే ఈ సారి సర్వేలో మొబైల్ యాప్ లను వినియోగించనున్నట్లు సమాచారం. దాదాపు లక్షా 64వేల మంది ఎన్యూమరేటర్లు ఈ సర్వే నిర్వహించనున్నారు.