ఢిల్లీకి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం
5వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సమావేశం;
భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఢిల్లీలోని నిర్వచన్ సాధన్ ప్రధాన కార్యాలయంలో ఆగస్టు 5, మంగళవారం మధ్యాహ్నం 3:00 గంటలకు దేశంలోని రాజకీయ పార్టీలతో తాను నిర్వహించనున్న సమావేశానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రతినిధి బృందాన్ని అధికారికంగా ఆహ్వానించింది. ఈ ప్రతినిధి బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్యే కె. తారకరామారావు (కేటీఆర్) నేతృత్వం వహించనున్నారు. ఆయనతో పాటు పార్టీ కీలక నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు ఈ బృందంలో ఉండనున్నారు:
కె.ఆర్. సురేశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మరియు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్
వడ్డిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు
బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ
బల్క సుమన్, మాజీ ఎంపీ మరియు పార్టీ సీనియర్ నేత
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి
ఈ మేరకు భారత రాష్ట్ర సమితి పార్టీకి, ఈసీఐ కార్యదర్శి అశ్విని కుమార్ మొహాల్ ఒక అధికారిక లేఖలో కోరారు. ఈ ఆహ్వానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా బీఆర్ఎస్ అధ్యక్షులకు కూడా పంపారు.
మీడియా వర్గాల సమాచారం ప్రకారం, ఈ సమావేశంలో ఎన్నికల సంస్కరణలు, ఇప్పటికే ఈసీఐకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు, మరియు ఎన్నికల ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.