Abhishek Sharma Creates Sensation: ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఆదివారం (డిసెంబర్ 14) దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో అతను టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 300 సిక్సర్లు బాదిన భారతీయ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనత సాధించడానికి అభిషేక్ శర్మకు కేవలం 163 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి. ఛేజింగ్‌లో ఐదో ఓవర్‌ తొలి బంతిని ఒట్నీల్ బార్ట్‌మన్‌ బౌలింగ్‌లో సిక్సర్‌గా మలచడం ద్వారా అతను ఈ మైలురాయిని చేరుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్‌ తొలి బంతిని లుంగీ ఎంగిడికి సిక్సర్‌గా మలచడం ద్వారా అభిషేక్ తన హిట్టింగ్ పరంపరను ప్రారంభించాడు.

అభిషేక్ శర్మ కంటే ముందు, టీ20ల్లో అత్యంత వేగంగా 300 సిక్సర్లు కొట్టిన భారతీయ బ్యాటర్ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ ఈ ఘనతను 205 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ (251 ఇన్నింగ్స్‌లు) మూడవ స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ తన మొత్తం 300 టీ20 సిక్సర్లలో 107 సిక్సర్లు కేవలం ఈ ఒక్క 2025 సంవత్సరంలోనే బాదడం అతని దూకుడుకు నిదర్శనం.

టీ20 క్రికెట్‌లో భారతీయ బ్యాటర్లలో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు రోహిత్ శర్మ (463 మ్యాచ్‌లలో 547 సిక్సర్లు) పేరిట పదిలంగా ఉంది. అతని తర్వాత విరాట్ కోహ్లీ (414 మ్యాచ్‌లలో 435 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (345 మ్యాచ్‌లలో 395 సిక్సర్లు), సంజు శాంసన్ (319 మ్యాచ్‌లలో 368 సిక్సర్లు), ఎంఎస్ ధోని (405 మ్యాచ్‌లలో 350 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (239 మ్యాచ్‌లలో 332 సిక్సర్లు), సురేష్ రైనా (336 మ్యాచ్‌లలో 325 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (313 మ్యాచ్‌లలో 308 సిక్సర్లు) ఉన్నారు.

ఈ ఏడాది (2025) అభిషేక్ శర్మ ఇప్పటివరకు 40 టీ20 మ్యాచ్‌లలో మొత్తం 1568 పరుగులు సాధించాడు. సౌతాఫ్రికాతో మిగిలిన రెండు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అతను మరో 47 పరుగులు చేయగలిగితే, ఒక క్యాలెండర్ సంవత్సరంలో భారతీయ క్రికెటర్ అత్యధిక టీ20 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును (2016లో 1614 పరుగులు) అధిగమించే అవకాశం ఉంది.

Tags: