2027 ODI World Cup: బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రషీద్ ఖాన్ అద్భుతమైన ప్రదర్శనతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. సోమవారం (ఆగస్టు 10) జరిగిన ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ మొదట 3 వికెట్లు పడగొట్టి, ఆ తర్వాత అజేయంగా 37 పరుగులు సాధించాడు. దీంతో అఫ్గానిస్తాన్ 44.5 ఓవర్లలో 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో అఫ్గానిస్తాన్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

ఐర్లాండ్ గడ్డపై వరుసగా రెండో విజయం సాధించడం ద్వారా అఫ్గానిస్తాన్ జట్టు.. 2027 వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించింది.

2015లో వన్డే ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టిన అఫ్గానిస్తాన్, 2023 పురుషుల 50 ఓవర్ల మెగా టోర్నమెంట్‌లో ఆరో స్థానంలో నిలిచింది. తాజా మ్యాచ్‌లో వికెట్ కీపర్-బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ 77 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. నూతనంగా మూడో స్థానంలో బరిలోకి దిగిన సెదిఖుల్లా అటల్ 25 బంతుల్లో 27 పరుగులు చేశాడు.

బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టిన రషీద్ ఖాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. అంతకుముందు రెండో వన్డేలోనూ రషీద్ 6 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో రషీద్‌తో పాటు స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ 9 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, యామిన్ అహ్మద్‌జాయ్ 9 ఓవర్లలో 35 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

ఈ ఓటమి ఐర్లాండ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. గత జూన్‌లో భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్ జట్టు, ప్రస్తుత సిరీస్‌లో మాత్రం ఆ జోరును కొనసాగించలేకపోయింది.

ఈ ఓటమితో ఐర్లాండ్ 2027 వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్స్‌లో ఆడటం ఖాయమైంది. వచ్చే ఏడాది జరిగే మెగా టోర్నమెంట్‌కు నేరుగా అర్హత సాధించాలంటే ఐర్లాండ్ ఈ సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేయాల్సి ఉంది. అయితే ఆగస్టు 5న బ్రెడీలో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతోనే వారి ప్రత్యక్ష అర్హత అవకాశాలు ముగిశాయి.

Tags: