IPL 2026: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు రోహిత్ శర్మ రెడీ!

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు రోహిత్ శర్మ రెడీ!

Update: 2026-04-25 11:08 GMT

IPL 2026: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. గత కొన్ని మ్యాచులకు దూరమైన ముంబై స్టార్ బ్యాటర్, 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్.. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ (Cricbuzz) ధృవీకరించింది.

ఏప్రిల్ 29న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే కీలక పోరులో రోహిత్ బరిలోకి దిగే అవకాశం మెండుగా ఉంది. ఏప్రిల్ 12న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో బ్యాటింగ్ చేస్తూ రోహిత్ దురదృష్టవశాత్తూ గాయపడ్డారు. ఆ గాయం తీవ్రత వల్ల ఆయన గత మూడు మ్యాచులకు, అంటే పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ , చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ పోరులకు దూరమవ్వాల్సి వచ్చింది.

రోహిత్ లేని లోటు ముంబై బ్యాటింగ్ లైన్-అప్‌లో స్పష్టంగా కనిపించింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత రోహిత్ ప్రస్తుతం తన ఫిట్‌నెస్‌పై తీవ్రంగా శ్రమిస్తున్నారు. నెట్స్‌లో మళ్ళీ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో ప్రాక్టీస్ మొదలుపెట్టారని సమాచారం. ఈ సీజన్ ఆరంభంలో రోహిత్ అదిరిపోయే ఫామ్‌లో ఉన్నారు. ఆడిన కేవలం నాలుగు మ్యాచుల్లోనే 137 పరుగులు చేసి జట్టుకు శుభారంభాలను అందించారు.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబైకి ప్రతి మ్యాచ్ ఎంతో కీలకం. ఇలాంటి సమయంలో రోహిత్ వంటి అనుభవజ్ఞడైన ప్లేయర్ జట్టులోకి రావడం ముంబై ఇండియన్స్‌కు కొండంత బలాన్ని ఇస్తోంది. అటు ఫామ్‌లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను రోహిత్ తన క్లాస్ బ్యాటింగ్‌తో ఎలా ఎదుర్కొంటారో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News