Rahul Dravid: ఇంగ్లాండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ద్రవిడ్ గ్రీన్ సిగ్నల్!
ద్రవిడ్ గ్రీన్ సిగ్నల్!
Rahul Dravid: ఇంగ్లాండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్గా బ్రెండన్ మెకల్లమ్ వైదొలగడంతో, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ద్రవిడ్ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెకల్లమ్ కేవలం వైట్-బాల్ జట్లకు మాత్రమే కోచ్గా కొనసాగనుండటంతో, టెస్టు జట్టు కోసం ఈసీబీ కొత్త కోచ్ వేటలో ఉంది. ఇటీవలే భారత జట్టుకు కోచింగ్ బాధ్యతలు నిర్వహించిన ద్రవిడ్, తన హయాంలో భారత్ను ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేర్చడంతో పాటు 2024 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిపారు.
పూర్తిస్థాయి కోచింగ్ బాధ్యతలు చేపట్టే ఉద్దేశం ద్రవిడ్కు లేకపోయినప్పటికీ, కేవలం టెస్టు జట్టుకు మాత్రమే కోచ్గా వ్యవహరిస్తే కుటుంబంతో గడిపేందుకు తగినంత సమయం దొరుకుతుందని ద్రవిడ్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ద్రవిడ్తో పాటు మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ ఈ రేసులో అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్లో పనిచేస్తూనే ఇంగ్లాండ్ కోచ్గా కొనసాగే వీలును కల్పించాలని ఈసీబీ భావిస్తుండటంతో, ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్గా ఉన్న ఆండీ ఫ్లవర్ ఈ పదవిని చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఫ్లవర్తో పాటు కుమార సంగక్కర, ఆండ్రూ ఫ్లింటాఫ్, జస్టిన్ లాంగర్, రిచర్డ్ డాసన్ మరియు మైక్ హెస్సన్ వంటి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కీలకమైన బాధ్యతల కోసం తమ వద్ద 6 నుంచి 10 మందితో కూడిన షార్ట్లిస్ట్ సిద్ధంగా ఉందని ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ తెలిపారు. ప్రస్తుతం క్రికెట్ క్యాలెండర్ బిజీగా ఉన్న నేపథ్యంలో, ఆటగాళ్లే కాకుండా కోచింగ్ సిబ్బంది కూడా వివిధ లీగ్లు మరియు అంతర్జాతీయ క్రికెట్ మధ్య సమన్వయం చేసుకునేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.