Manpreet Singh: బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్త వేదికగా ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచ కప్ (FIH Hockey World Cup 2026) కోసం భారత జట్టు సర్వసన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత హాకీ జట్టు సీనియర్ మిడ్‌ఫీల్డర్, మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తనకు ఇదే చివరి ప్రపంచ కప్ కావచ్చని, సరిగ్గా ఇదే మైండ్‌సెట్‌తో టోర్నమెంట్‌లోకి అడుగుపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

మన్‌ప్రీత్ సింగ్‌కు ఇది నాల్గో ప్రపంచ కప్ టోర్నమెంట్. ఒలింపిక్స్‌లో వరుస పతకాలు సాధించినప్పటికీ, ప్రపంచ కప్ ట్రోఫీ మాత్రం తమకు ఇంకా దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ఒలింపిక్ మెడల్స్ గెలిచాం.. కానీ వరల్డ్ కప్ పతకం ఇంకా మా అందరికీ అందలేదు. ప్రతి ఆటగాడి కల అదే. నావరకైతే ఇదే చివరి ప్రపంచ కప్ కావొచ్చు. ఆ లోటును భర్తీ చేయాలనే కసితో బరిలోకి దిగుతున్నాం" అని మన్‌ప్రీత్ పేర్కొన్నారు.

భారత హాకీ జట్టు చివరిసారిగా 1975లో ప్రపంచ కప్‌ను ముద్దాడింది. సరిగ్గా 51 సంవత్సరాల నుంచి ఊరిస్తున్న ఈ ప్రపంచ కప్ విజయాన్ని ఈసారైనా సాధించాలని టీమ్‌ఇండియా పట్టుదలగా ఉంది.

ఈ టోర్నమెంట్‌లో భారత్ ‘పూల్-డి’లో చోటు దక్కించుకుంది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు వేల్స్, ఇంగ్లాండ్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. ఆగస్టు 15న వేల్స్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ తన ప్రపంచ కప్ అభియానాన్ని ప్రారంభించనుంది. ఆ తర్వాత ఆగస్టు 17న ఇంగ్లాండ్‌తో, ఆగస్టు 19న పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. జట్టులోని యువ ఆటగాళ్లు, సీనియర్లు సమన్వయంతో రాణించి ఈసారి తప్పకుండా ఫైనల్‌కు చేరుకుంటామని మన్‌ప్రీత్ ధీమా వ్యక్తం చేశారు

Tags: