Vaibhav Suryavanshi Fever: వైభవ్ సూర్యవంశీ క్రేజ్.. క్షణాల్లోనే అమ్ముడైన భారత్-ఐర్లాండ్ మ్యాచ్ టికెట్లు!

భారత్-ఐర్లాండ్ మ్యాచ్ టికెట్లు!

Update: 2026-06-26 12:06 GMT

Vaibhav Suryavanshi Fever: క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క పేరు వినబడుతోంది, అదే వైభవ్‌ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడే భారత జట్టుకు ఎంపికై ఈ యువ ఆటగాడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకవేళ ఈ సిరీస్‌లో గనుక అతడు మైదానంలోకి అడుగుపెడితే, అది కూడా ఒక పెద్ద రికార్డుగా నిలిచిపోతుంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్ పర్యటనలో ఉంది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇరుదేశాల మధ్య తొలి మ్యాచ్ ఈరోజు సాయంత్రమే జరగనుంది. అయితే ఈ మొదటి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడుతున్నాడా లేదా అనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కానీ, అతడిని చూడాలనే అభిమానుల ఉత్సాహం మరియు క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే.. బెల్‌ఫాస్ట్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ టికెట్లన్నీ విక్రయాలు మొదలైన క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఇదే విషయాన్ని ఐర్లాండ్ క్రికెట్ కమిటీ ఛైర్మన్ బ్రియాన్ మాక్‌నీస్ కూడా అధికారికంగా వెల్లడించారు.

మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి తన ఫోన్ అస్సలు ఆగకుండా మోగుతూనే ఉందని బ్రియాన్ మాక్‌నీస్ చెప్పారు. తమకు మరిన్ని టికెట్లు కావాలంటూ క్రికెట్ అభిమానుల నుంచి విపరీతంగా అభ్యర్థనలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బెల్‌ఫాస్ట్‌లోని ఈ మైదానంలో తాము కేవలం ఐదారు వేల మంది ప్రేక్షకులకు మాత్రమే కూర్చునేందుకు ఆతిథ్యం ఇవ్వగలమని, కానీ మ్యాచ్ చూడటానికి మాత్రం అంతకు మూడింతల కంటే ఎక్కువ డిమాండ్ వచ్చిందని వివరించారు. టికెట్లన్నీ క్షణాల్లోనే అయిపోయినా, ఇంకా కావాలంటూ వస్తున్న ఒత్తిడిని తాము తట్టుకోలేకపోతున్నామని అన్నారు. ప్రస్తుతం అక్కడ ప్రతి ఒక్కరూ వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుకుంటున్నారని, అతడు జట్టులోకి రావడం మ్యాచ్‌కు అదనపు ఆకర్షణగా మారిందని చెప్పారు. ఈ తొలి టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తుంటే, ఆ చారిత్రాత్మక క్షణాన్ని మైదానంలో ప్రత్యక్షంగా చూడాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతున్నట్లు ఆయన తెలిపారు.

మరోవైపు, ఇంత పెద్ద మ్యాచ్ కోసం బెల్‌ఫాస్ట్ మైదానాన్ని వేదికగా ఎంపిక చేయడంపై క్రికెట్ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చాలా తక్కువ సీటింగ్ సామర్థ్యం ఉన్న ఇలాంటి చిన్న స్టేడియంలో భారత్ లాంటి పెద్ద జట్టుతో మ్యాచ్ నిర్వహించడం ఎంతవరకు సరైంది కాదని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఐర్లాండ్‌లోని డబ్లిన్ నగరంలో ఎంతో పెద్ద స్టేడియం అందుబాటులో ఉన్నప్పటికీ, దానిని కాదని బెల్‌ఫాస్ట్‌లో మ్యాచ్ పెట్టడం ఏమాత్రం సబబు కాదంటూ క్రీడా విశ్లేషకులు మరియు అభిమానులు యాజమాన్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News