Virat Kohli: టెస్ట్ క్రికెట్లోకి విరాట్ కోహ్లీ మళ్లీ రీ-ఎంట్రీ?
విరాట్ కోహ్లీ మళ్లీ రీ-ఎంట్రీ?
Virat Kohli: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గతేడాది (మే 12, 2025న) టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి కోట్లాది మంది అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. జూన్ 2011 నుండి జనవరి 2025 వరకు టీమిండియా తరఫున 123 టెస్ట్ మ్యాచ్లు ఆడి, 9230 పరుగులతో భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన నాల్గవ బ్యాటర్గా ఆయన తన టెస్ట్ కెరీర్ను ముగించారు. అయితే, ఆయన టెస్ట్ ఫార్మాట్కు గుడ్ బై చెప్పి ఏడాది దాటినప్పటికీ.. కోహ్లీ మళ్లీ వైట్ జెర్సీ ధరించి, టీమిండియా తరఫున బరిలోకి దిగాలని అభిమానులు ఇప్పటికీ బలంగా కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో, విరాట్ కోహ్లీ మళ్లీ టెస్టుల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా అనే విషయంపై ఆయన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ ఒక పెద్ద అప్డేట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో రాజ్కుమార్ శర్మ మాట్లాడుతూ.. తాను విరాట్తో టెస్ట్ క్రికెట్ పునరాగమనం (రీ-ఎంట్రీ) గురించి మాట్లాడినట్లు వెల్లడించారు. "విరాట్ మీ మాట వింటాడు కాబట్టి, అతడిని మళ్లీ టెస్ట్ క్రికెట్లోకి తిరిగి వచ్చేలా అడగమని చాలా మంది నాతో చెప్పారు" అని రాజ్కుమార్ పేర్కొన్నారు. మరి మీరు విరాట్ను తిరిగి రమ్మని అడిగారా? అని ప్రశ్నించగా.. "మేము దాని గురించి మాట్లాడుకుంటున్నాము, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం" అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూన్ 2011లో వెస్టిండీస్పై టెస్ట్ అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ, తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. 2014 నుండి 2022 వరకు 60 టెస్టుల్లో భారత జట్టును ముందుండి నడిపించారు. ఐదు రోజుల ఈ సుదీర్ఘ ఫార్మాట్లో భారతదేశపు అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచిన కోహ్లీ.. 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్కు మొట్టమొదటి చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించారు. అయితే, నవంబర్ 2024 నుండి జనవరి 2025 వరకు ఆస్ట్రేలియాతో జరిగిన తన చివరి టెస్ట్ సిరీస్లో ఆయన బ్యాటింగ్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఆ సిరీస్లోని 9 ఇన్నింగ్స్ల్లో కలిపి ఆయన కేవలం 190 పరుగులు మాత్రమే చేయగలిగారు. అందులోనూ పెర్త్లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో చేసిన 100 పరుగులు మాత్రమే చెప్పుకోదగ్గవి.
టెస్టులకు దూరమైనప్పటికీ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నారు. రజత్ పాటిదార్ కెప్టెన్సీ వహిస్తున్న ఆర్సీబీ జట్టు తరఫున ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్ల్లో కోహ్లీ ఏకంగా 542 పరుగులు సాధించారు. పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరిగిన గత మ్యాచ్లో 58 పరుగులు చేసిన విరాట్.. అంతకుముందు కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్లో 193 పరుగుల ఛేజింగ్లో అజేయ సెంచరీతో జట్టును గెలిపించి తానెంతటి లీడరో మరోసారి నిరూపించుకున్నారు. ఈ క్రమంలో ఆయన కోచ్ చేసిన తాజా వ్యాఖ్యలు కోహ్లీ టెస్ట్ రీ-ఎంట్రీపై అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి.