Kohli Slams Broadcasters: మాకు స్వేచ్ఛ లేదు.. - బ్రాడ్కాస్టర్లపై మండిపడ్డ కోహ్లీ
బ్రాడ్కాస్టర్లపై మండిపడ్డ కోహ్లీ
Kohli Slams Broadcasters: ఐపీఎల్లో కంటెంట్ క్రియేషన్ కల్చర్ శ్రుతిమించుతోందా? నిరంతరం కెమెరాల నిఘాతో ఆటగాళ్లు స్వేచ్ఛను కోల్పోతున్నారా? అంటే... అవుననే అంటున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో సెంచరీలతో అదరగొడుతున్న రన్మెషిన్ కోహ్లీ... తాజాగా 'ఆర్సీబీ పాడ్కాస్ట్'లో పాల్గొని ఫ్రాంఛైజీలు, బ్రాడ్కాస్టర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
బ్రాడ్కాస్టింగ్, సోషల్ మీడియా ప్రమోషన్స్ ముఖ్యమేనని... కానీ కంటెంట్ క్రియేషన్పై కాస్త నియంత్రణ ఉండాలని కోహ్లీ స్పష్టం చేశారు. డిజిటల్ ప్లాట్ఫారమ్ల కోసం ఆటగాళ్ల నుంచి నిరంతరం కంటెంట్ ఆశించడం వల్ల... మైదానంలో సహజమైన వాతావరణం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాక్టీస్ కోసం బయటకు రాగానే కెమెరాలు వెంబడించడం... తాము చేసే ప్రతీ చిన్న పనిని రికార్డు చేసి విశ్లేషించడం ఆటగాళ్లను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోందని కోహ్లీ పేర్కొన్నారు.
ఈ కెమెరాల నిఘా కేవలం ప్రాక్టీస్కే పరిమితం కావడం లేదని... చివరకు సహచర ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోతోందని విరాట్ మండిపడ్డారు. ఇటీవల గుజరాత్ టైటాన్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్తో తాను సీరియస్గా మాట్లాడుతుండగా... రోబో కెమెరా వచ్చి రికార్డ్ చేయడాన్ని కోహ్లీ గుర్తుచేశారు. 'కేన్ నా ఫ్రెండ్... మమ్మల్ని ప్రశాంతంగా మాట్లాడుకోనివ్వండి' అని ఆ కెమెరా ఆపరేటర్కు చెప్పాల్సి వచ్చిందని విరాట్ వివరించారు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానం వరకు తాము ఎవరితో మాట్లాడినా అది వార్తగా మారిపోతోందని... ఈ అతి ఏమాత్రం సరికాదని కోహ్లీ హితవు పలికారు