రాజీవ్ హైవేకు సమాంతరంగా మరో గ్రీన్ఫీల్డ్ హైవే
హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ప్రయాణాన్ని మరింత వేగవంతంగా మార్చేందుకు, ప్రమాదాలు నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్-కరీంనగర్-రామగుండం మార్గానికి సమాంతరంగా కొత్త గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణంపై ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ రహదారి కోసం ఇప్పటికే మూడు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఒక ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. ప్రస్తుతం ఉన్న రాజీవ్ రహదారి నాలుగు వరుసలుగా ఉండి ప్రైవేట్ సంస్థ టోల్ వసూలు చేస్తోంది. ఇది 2010లో పీపీపీ మోడల్లో ప్రారంభమై 2036 వరకు ఆ సంస్థ నిర్వహణలో ఉండేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ తీవ్రత పెరగడం, ఈ రహదారిలో మూల మలుపులు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు జరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.
ఎన్హెచ్ఏఐ, ఆర్అండ్బీ అధికారులు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కోసం మూడు మార్గాలను ప్రతిపాదించారు. మొదటి ప్రతిపాదన చూస్తే.. ప్రస్తుత రోడ్డుకు ఎడమవైపున 188 కిలోమీటర్ల దూరంతో ఉండే ఈ మార్గం శామీర్పేట నుంచి మొదలై తుర్కపల్లి, వర్గల్, దుబ్బాక, హరిదాసనగర్, కోనాయిపల్లి, దాతోజీపేట, అంతర్గాం మీదుగా మంచిర్యాల దగ్గరున్న ఎన్హెచ్-63కి అనుసంధానం చేస్తారు. ఈ మార్గంలో శామీర్పేట చెరువు, అప్పర్ మానేరు డ్యామ్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిధిలో నిర్మాణం చేపట్టాల్సి ఉన్నందున నిర్మాణ వ్యయం రూ.4,700 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇక రెండో ప్రతిపాదన చూస్తే.. ఇది శామీర్పేట నుంచే ప్రారంభమై నారాయణపూర్, ఎర్రవల్లి, తిమ్మాపూర్, కొమురవెల్లి, అంకుశాపూర్, నగునూర్, బస్వాపూర్, నవాబ్పేట, చిగురుమామిడి, తడికాల, మానేరు రివర్ క్రాసింగ్, కొలనూర్, వెన్నంపల్లి, ఏదులాపురం, లక్కారం నుంచి పుట్టపాక, కిష్టాపూర్, శ్రీరాంపూర్ మీదుగా మంచిర్యాల దగ్గరున్న ఎన్హెచ్-63కి కలుపుతారు. గ్రీన్ఫీల్డ్ విధానంలో 160 కి.మీ. జాతీయ రహదారుల అనుసంధానంగా మరో 46 కి.మీ.నిర్మాణం ఉంటుంది. ఈ మార్గంలో కొంతమేర అటవీ భూమి సేకరించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో నిర్మాణానికి రూ.4,000 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇక, మూడో ప్రతిపాదన చూస్తే.. ఈ మార్గం శామీర్పేట నుంచి మొదలై నారాయణపూర్, కొమురవెల్లి దగ్గర ఎన్హెచ్-365బీ వరకు ఆప్షన్-2లో ఉన్న విధంగానే ఉంటుంది. ఆ తర్వాత చేర్యాల దగ్గరి నుంచి భైరాన్పల్లి, కన్నారం, ముల్కనూర్, ఎల్కతుర్తి, కమలాపూర్, మర్రిపల్లిగూడెం, టేకుమట్ల.. ఆ తర్వాత మానేరు డ్యామ్ క్రాస్ అయి ముత్తారం, పుట్టపాక, కిష్టాపూర్, శ్రీరాంపూర్ మీదుగా మంచిర్యాలకు దగ్గర్లోని ఎన్హెచ్-63కి కలుపుతారు. ఈ మూడో ప్రతిపాదనలో నిర్మాణానికి రూ.3,000 కోట్ల నిధులు కావాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఈ మూడు ఆప్షన్లలో ఇదే ఉత్తమంగా ఉందని అధికారులు పేర్కొనడంతో సీఎం దీనికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ప్రయాణం వేగవంతం అవడంతో పాటు, భవిష్యత్తులో నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు రూపొందుతున్న జాతీయ రహదారికి ఇది అనుసంధానంగా మారే అవకాశం ఉంది. ఇది రాష్ట్రానికే కాకుండా దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే మార్గంగా నిలవనుందంటున్నారు అధికారులు.