బీవీపట్టాభిరామ్ గుండెపోటుతో మృతి
ఎమెస్కో విజయకుమార్ సంతాపం;
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మెజీషియన్, హిప్నోటిస్ట్ డాక్టర్ బీవీపట్టాభిరామ్ సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయనకు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. భావరాజు వెంకట పట్టాభిరామ్ తొలుత మెజీషియన్ గా ఖ్యాతి గడించారు. ఎనభైయ్యొవ దశకంలో హిప్నోసిస్ట్ గా, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, ఫ్యామిలీ కౌన్సలర్ గా ప్రసిద్ది పొందారు. మెజీషియన్ గా హిప్నోటిస్ట్ గా ఆయన ప్రదర్శించిన ప్రతిభాపాటవాలకు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని పీవీనరసింహారావు, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వంటి నేతల నుంచి పలు ప్రశంసలు అందుకున్నారు. బీవీపట్టాభిరామ్ మృతికి ప్రముఖ పబ్లిషర్ ఎమెస్కో విజయ్ కుమార్ సంతాపం తెలియజేశారు. జూలై 2వ తేదీన అభిమానులు, ఫాలోవర్ల సందర్శనార్ధం బీవీపట్టాభిరామ్ భౌతికకాయాన్ని ఖైరతాబాద్ శ్రీధర్ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న సింఫనీ డ్వెల్లింగ్స్ లో ఉంచుతారని విజయకుమార్ ఓ ప్రకటనలో తెలియజేశారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు బీవీపట్టాభిరామ్ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహా ప్రస్ధానంలో జరిగుతాయని ఎమెస్కో విజయకుమార్ తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ‘రావ్ సాహెబ్’ భావరాజు సత్యనారాయణ సంతానంలోని 15 మందిలో బీవీ పట్టాభిరామ్ ఒకరు. కాకినాడలో ఉన్నత విద్య చదువుతున్న రోజుల్లో ఎంబేర్ రావు అనే ఇంద్రజాలికుడి నుంచి ఆ విద్యను నేర్చుకుని.. ఆ తర్వాత హైదరాబాద్లోని ఆహార సంస్థలో ఉద్యోగం చేసే రోజుల్లోనూ సాధన చేసి.. 1970 దశకం నాటికి ఇండిపెండెంట్ గా రెండుమూడు గంటల పాటు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఇంద్రజాలం ప్రదర్శించే స్థాయికి బీవీ పట్టాభిరామ్ ఎదిగారు.
దాదాపు అర్థ శతాబ్దం పాటు ఆయన ఇంద్రజాలికుడిగా, సైకాలజీస్టుగా సమాజానికి సేవలందించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సైకాలజీ, ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. అలాగే ఇదే యూనివర్సిటీ నుంచి యోగా, హిప్నోటిజనంలో పీహెచ్డీ చేశారు. భారత ఆహార సంస్థలో ఆయన ఉద్యోగిగా విధులు నిర్వహించారు. పలు పురస్కారాలను సైతం ఆయన అందుకున్నారు.