Kishanreddy : కాంగ్రెస్‌ పార్టీ బీసీలను మోసం చేస్తోంది-కిషన్‌రెడ్డి

ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఓడిపోతుంది;

Update: 2025-07-25 12:23 GMT

కులగణన పేరుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిరాని సర్వే నిర్వహించిందని కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి ఆరోపించారు. 75 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎప్పుడూ బీసీ గణన చేయలేదని ఇప్పుడు వారిని మభ్యపెట్టడానికే ఈ సర్వే చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన కిషన్‌ రెడ్డి బీసీని ప్రధానిగా చేసిన ఘనత బీజేపీదే అన్నారు. బీసీలను కాంగ్రెస్‌ పార్టీ మభ్య పెడుతోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి విఫలమయ్యిందని కాంగ్రెస్‌ పార్టీని కిషన్‌ రెడ్డి విమర్శించారు. బీసీల్లో ముస్లింలను కలపడం వల్ల బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో బీసీ స్ధానాల్లో ముస్లీంలను పోటీలో నిలపడం ఇందుకు ఉదాహరణగా కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర కలగణన బీసీల్లో ముస్లింలను కలిపేదిగా ఉండదని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. భారత దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రెండొవ వ్యక్తిగా నరేంద్ర మోడీ ఘనత సాధించారని కిషన్‌ రెడ్డి కొనియాడారు. నరేంద్ర మోడీ బీసీ ఎలా అవుతారని కొంత మంది ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెస్‌ హయాంలో మండల కమిషన్‌ ద్వారానే మోడీ కులాన్ని బీసీల్లో చేర్చారని కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. రేవంత్‌ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ ఓటమి ఖయమని కిషన్‌ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పాలిత మూడు రాష్ట్రల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ పార్టీ ఓటమి తప్పదని కిషన్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెట్రో విషయంలో రాష్ట్రానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని కిషన్‌రెడ్డి చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సీయం రేవంత్‌రెడ్డి పిల్లిమొగ్గలు వేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News