Minister Thummala Nageswara Rao: అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వారికి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తుల రక్షణ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం వర్షాల పరిస్థితులపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ఈ మేరకు సూచనలు చేశారు.

ప్రస్తుతం మార్కెట్ యార్డులకు భారీ మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తులు వస్తున్న నేపథ్యంలో, వాటిని తడవకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. టార్పాలిన్ షీట్లను ఉచితంగా అందించాలని, ఉత్పత్తులను నేరుగా నేలపై నిల్వ చేయకుండా సరైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మార్కెట్ షెడ్లు, గోదాముల పైకప్పులను పరిశీలించి, లీకేజీలు ఉంటే తక్షణమే మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ వాతావరణ సూచనలను రైతులు, వ్యాపారులకు తెలియజేయాలని, రాత్రి సమయాల్లో తగిన లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిల్వల రక్షణ కోసం భద్రతా సిబ్బందిని నియమించాలని, సాధ్యమైన చోట్ల సీసీటీవీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. రైతుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.

Tags: