Harish Rao Demands: రైతుబంధు చెల్లింపులపై ప్రభుత్వం స్పందించాలి: హరీశ్‌రావు డిమాండ్

ప్రభుత్వం స్పందించాలి: హరీశ్‌రావు డిమాండ్

Update: 2026-02-26 10:18 GMT

Harish Rao Demands: మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇప్పటి వరకు ఆ విషయాన్ని ప్రస్తావించడం కూడా లేదని భారాస శాసనసభాపక్ష ఉపనేత టి.హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల కోడ్‌ ముగిసి పది రోజులు గడిచినా, క్యాబినెట్‌ సమావేశంలో కూడా రైతుబంధు నిధుల గురించి చర్చ జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘రైతుల బాధలు, కన్నీళ్లపై నిర్మితమైన ప్రభుత్వాలు ఎప్పుడూ స్థిరంగా ఉండలేదు. ఎన్నికల్లో ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రస్తుతం తన ప్రాధాన్యతలను పూర్తిగా మార్చేశారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15,000 రైతుబంధు ఇస్తామని చెప్పి, ఇప్పుడు రెండు సీజన్ల రైతుబంధు నిధులను ఎగవేస్తున్నారు. రైతులకు సకాలంలో సాయం అందించడానికి నిధులు లేవని చెప్పే ముఖ్యమంత్రికి.. మూసీ నది సుందరీకరణ, ఫ్యూచర్‌ సిటీ పేరుతో భూసేకరణలకు వేల కోట్ల రూపాయలు ఎలా వస్తున్నాయి?’’ అని హరీశ్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు. ఇకనైనా రైతుబంధు నిధులను తక్షణమే విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News