Deputy Chief Minister Bhatti Vikramarka: భారాసపై నాజీ విలువల ఆరోపణ.. గవర్నర్కు మంత్రుల వినతిపత్రం
వినతిపత్రం
Deputy Chief Minister Bhatti Vikramarka: తెలంగాణను చీకటి యుగంలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ, శాసనసభ ప్రాంగణంలో, వెలుపల దళితులు, మహిళల భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు కాంగ్రెస్ మంత్రులు వినతిపత్రం అందజేశారు.
బుధవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, వెడ్మ బొజ్జు లోక్భవన్కు వెళ్లి గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. అసెంబ్లీ ఎదుట ఈ నెల 8న జరిగిన ఆందోళన, తదనంతర పరిణామాలను వారు వివరించారు.
వినతిపత్రంలో మంత్రులు పేర్కొన్నది ఇలా ఉంది: భారాస ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి ఉద్దేశపూర్వకంగా శాసనసభ స్పీకర్ ప్రసాద్కుమార్ను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఆయన తల్లిని ఉద్దేశించి అనుచిత పదజాలం ఉపయోగించి తీవ్రంగా బాధపెట్టడంతోపాటు, మొత్తం దళిత సమాజాన్ని, మహిళలను అవమానించారు.
శాసనసభ ప్రధాన ద్వారం వెలుపల మీడియా కెమెరాల సమక్షంలో భారాస ఎమ్మెల్యే హరీశ్రావు, ఆ పార్టీ నేతలు తమ చొక్కాలు విప్పి పోలీసు సిబ్బందిపై విసిరారు. అంతటితో ఆగకుండా విధుల్లో ఉన్న మహిళా పోలీసు సిబ్బంది వైపు అత్యంత అభ్యంతరకరంగా దూసుకెళ్లారు. కేటీఆర్ నేతృత్వంలో పలువురు ఆ పార్టీ నాయకులు మహిళా పోలీసు అధికారులపై భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు.
దళిత సమాజానికి చెందిన సభ్యులు శాంతియుతంగా ఎర్రవల్లి వైపు ర్యాలీగా వెళ్లి, భారాస అధినేత కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని కోరితే.. ఆ పార్టీ అత్యంత దారుణమైన చర్యలకు పాల్పడిందని మంత్రులు ఆరోపించారు. దళితులు నడిచారని రహదారులను పసుపు నీరు, పాలు చల్లి శుద్ధి చేసి అంటరానితన ఆచరణను ప్రదర్శించింది. ఈ దుశ్చర్యలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రచారం కూడా చేశారని పేర్కొన్నారు.
జర్మన్ నాజీ పార్టీ లేదా అమెరికన్ కూ క్లక్స్ క్లాన్ నైతిక విలువలను అనుసరిస్తున్న భారాస, అంటరానితనం సాధారణంగా ఉన్న చీకటి యుగంలోకి తెలంగాణను తిరిగి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందని మంత్రులు ఆరోపించారు. ఈ ఘటనలకు ప్రత్యక్షంగా పాల్పడిన వారిపైనే కాకుండా, భారాస అగ్ర నాయకత్వంలో ఉన్న అసలు కుట్రదారులకూ అత్యంత కఠినమైన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరారు.
ఈ విషయంపై భారాస నాయకులు తమ వైపు నుంచి వేరే వివరణలు ఇస్తున్నారు. అయినా కాంగ్రెస్ నేతలు ఈ సంఘటనలను తీవ్రంగా తీసుకుని గవర్నర్ జోక్యం కోరుతున్నారు.