Cm Revanth Reddy : భారీవర్షాలకు జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండండి
ఢిల్లీ నుంచి సీయంఓ అధికారులను ఆదేశించిన సీయం రేవంత్ రెడ్డి;
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గురువారం అక్కడి నుంచే సీయంఓ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీయం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున చెరువులు, కుంటలు నిండి వరద నీటి ఉదృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాల్లో కలెక్టర్లు అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలు, వరదలతో ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని చెప్పారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎప్పడికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీయం రేవంత్ రెడ్డి సూచించారు.