TPCC Chief Mahesh Kumar Goud: కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి సహా అందరికీ ఒకే రకమైన గౌరవం ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కూడా అదే గౌరవం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. ‘‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆవేదన, ఆందోళనను అర్థం చేసుకుంటాం. అయితే పార్టీకి సంబంధించిన అంశాలను నాలుగు గోడల మధ్యనే చర్చించాలి. బహిరంగంగా మాట్లాడకూడదు. రాజగోపాల్‌రెడ్డి ప్రజా నాయకుడు, నాకు మంచి మిత్రుడు. గీత దాటి మాట్లాడకూడదు. ఆయన అలా మాట్లాడటం సరికాదు’’ అని ఆయన అన్నారు.

సమయం వచ్చినప్పుడు అవకాశాలు ఉంటాయని, ఏం మాట్లాడినా అధిష్ఠానం దృష్టికి వెళ్తుందని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సూచించారు. బిల్లుల విషయంలో క్రమపద్ధతిలో ముందుకు సాగుతున్నామని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా వేరే విధంగా వ్యవహరిస్తున్నామని ఆయన వివరించారు.

తెలంగాణ ఉద్యమానికి, కాంగ్రెస్‌ పార్టీకి సంబంధం లేనివాళ్లు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు ఈ విధంగా స్పందించారు.

Tags: