Hyderabad Becomes India’s First ‘Physical Intelligence City’: దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన, స్మార్ట్ నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతలను వినియోగించుకుంటోంది. ఈ దిశగా మరో ముందడుగు పడింది. ప్రముఖ ఏఐ కంపెనీ ‘అనలాగ్ ఏఐ’ సీఈఓ అలెక్స్ కిప్‌మన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌ను ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీ’గా మార్చే పైలట్ ప్రాజెక్టుకు రూపురేఖలు సిద్ధమయ్యాయి.

ట్రాఫిక్ నిర్వహణ, నగర వరదల నివారణ, సరస్సుల పరిరక్షణ, వాతావరణ అంచనా, పారిశ్రామిక కాలుష్య నియంత్రణ వంటి కీలక రంగాల్లో రియల్ టైమ్ సెన్సార్ నెట్‌వర్క్, ఏఐ ఆధారిత స్మార్ట్ సొల్యూషన్స్ అమలు గురించి ఇరు నేతలూ విస్తృతంగా చర్చించారు. నగరవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలను ‘రియల్ టైమ్ సిటీ ఇంటెలిజెన్స్’ ప్లాట్‌ఫామ్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీంతో ట్రాఫిక్, ప్రజా భద్రత, అత్యవసర సేవలు – అన్నీ ఏకకాలంలో ఏఐ సమన్వయంతో పనిచేస్తాయి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.

ఈ పైలట్ ప్రాజెక్టు ఎనిమిది వారాల పాటు కొనసాగనుంది. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి హైదరాబాద్ దేశంలోనే మొదటి ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీ’గా అవతరించనుంది. భారత ఫ్యూచర్ సిటీని పరిశోధనా కేంద్రంగా, సుస్థిర పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ - 2047’ దీర్ఘకాలిక లక్ష్యాలను కిప్‌మన్‌కు వివరించారు.

‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ సాంకేతికత ఆర్థిక వృద్ధికి కూడా అత్యుత్తమ పరిష్కారాలు అందిస్తుందని అనలాగ్ ఏఐ సీఈఓ అలెక్స్ కిప్‌మన్ ధీమా వ్యక్తం చేశారు. డిసెంబరు 8, 9 తేదీల్లో జరగబోయే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’కు ఆయనను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

ఈ కొత్త సాంకేతికతతో హైదరాబాద్ మరింత సురక్షితంగా, సమర్థవంతంగా మారనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Tags: