మెదక్ జిల్లాతో ఇందిరమ్మకు విడదీయలేని అనుబంధం – రేవంత్ రెడ్డి
మెదక్ జిల్లాకు ఇందిరమ్మకు విడదీయలేని అనుబంధం ఉందని, మెదక్ పేరు గుర్తుస్తే వెనువెంటనే ఇందిరమ్మ గుర్తుకు వస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీయం అనంతరం జహీరాబాద్ లో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీయం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిమ్జ్ అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా ప్రభుత్వం వచ్చాక నిమ్జ్ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం పెంచామని, భూ సేకరణను వేగవంతం చేశామన్నారు. త్వరలో హ్యందాయ్ కార్ల తయారీ కంపెనీ పనులు ఇక్కడ మొదలు పెడతామని చెప్పడానికి సంతోషంగా ఉందన్నారు. 5612 మంది నిమ్జ్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తామని సీయం ప్రకటించారు. నిర్వాసిత కుటుంబాలకు భోజనాలు పెట్టి ఇళ్ళ పట్టాలు అందించే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్దికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నారాయణఖేడ్ కి సురేష్ షట్కార్, సంజీవరెడ్డిలు రెండు కళ్ళలాంటి వాళ్లని వారిద్దరి విజ్ఞప్తి మేరకు ఆ నియోజకవర్గ అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకుంటామన్న సీయం రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధాని మోడీని ఎన్నిసార్లయినా కలుస్తామని స్పష్టం చేశారు. శాసనసభ సమావేశాలకు వచ్చి మేము ఏదైనా తప్పులు చేస్తే సూచనలు ఇవ్వమని ప్రతిపక్ష నేతకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం ఇచ్చే వరకు నేను నిద్రపోయేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.