శ్రీ విశ్వ శాంతి మహా శక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు
భక్తిశ్రద్ధలతో కర్రపూజ చేసిన ఉత్సవ సమితి;
దేశ వ్యాప్తంగా పేరు గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి ఈయేడు శ్రీ విశ్వ శాంతి మహా శక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఖైరతాబాద్ మహా గణేశుడికి ఎడమ వైపున లలిత త్రిపుర సుందరి, గజ్జలమ్మ అమ్మవారి విగ్రహాలు కొలువు దీరనుండగా.. కుడి వైపు లక్ష్మి పార్వతి విగ్రహాలు రూపొందించనున్నారు.
గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా భక్తులకు దర్శనమీయనున్న మహా గణపతి నిర్మాణం కోసం శుక్రవారం భక్తి శ్రద్ధలతో కర్ర పూజ నిర్వహించారు. ఈ కర్రపూజకు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. అలాగే, గణపతి ఉత్సవ కమిటీ నిర్వాహకులు సింగరి రాజ్కుమార్, తదితరులు కర్రపూజలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ 70 సంవత్సరాలనుండి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయని, ఈ యేడాది 71 సంవత్సరం సందర్బంగా జరుగుతున్న వేడుకలకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటామన్నారు. జాతీయ స్థాయిలో ఖైరతాబాద్ గణనాధుడికి పేరు ప్రతిష్టలు వచ్చాయని, ఇంతటి ప్రఖ్యాతి రావడానికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కారణమన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ త్వరగా కోలుకుని ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు దానం నాగేందర్. ప్రభుత్వం, పోలీస్ శాఖ అన్ని విధాలుగా తమకు సహకరిస్తోందని, మీడియా పాత్ర కూడా ఎప్పటికి మరచిపోలేమన్నారు. ఈ యేడాది కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహా గణపతి ఆశీర్వచనం పొందాలని కోరారు.