Minor Changes in Indiramma Housing Bill Payments: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో దశలవారీగా అందజేసే బిల్లు చెల్లింపుల్లో కొన్ని స్వల్ప మార్పులు చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజిఎ) కింద 90 పనిదినాలు, అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లు (ఐహెచ్‌హెచ్‌ఎల్) నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ మార్పులు అవసరమయ్యాయని ఆయన వివరించారు. లబ్ధిదారుల షెడ్యూల్‌లో మాత్రమే ఈ మార్పులు ఉంటాయి, మొత్తం రూ.5 లక్షల మొత్తంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మంత్రి ఒక ప్రకటనను విడుదల చేశారు.

‘‘ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మొదటి, రెండవ దశలు పూర్తయిన తర్వాత రూ.లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈ రెండు దశల చెల్లింపుల్లో ఎలాంటి మార్పులు లేవు. మూడవ దశలో రూ.2 లక్షలు అందజేస్తున్నాం. ఇందులో మార్పు చేసి రూ.1.60 లక్షలు చెల్లిస్తాం. మిగిలిన మొత్తాన్ని తరువాతి దశల్లో జమ చేస్తాం. పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ మార్పులు చేపట్టాం. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలి’’ అని మంత్రి పొంగులేటి విజ్ఞప్తి చేశారు.

Tags: