Minister Sridhar Babu: తెలంగాణ రాష్ట్ర నీటి వాటాల విషయంలో ఎలాంటి రాజీకి తావు లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశానికి హాజరై రాష్ట్ర ప్రయోజనాల కోసం బలమైన వాదనలు వినిపిస్తామని ఆయన ప్రకటించారు.

బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, వాటర్‌వర్క్స్, మున్సిపల్ సమస్యలు, దేవాలయాల అభివృద్ధి, పెండింగ్ బిల్లులు, భూమి, రెవెన్యూ, వృద్ధాప్య, ఒంటరి మహిళల పింఛన్లు, ఐటీ ఉద్యోగాలు తదితర అంశాలపై మొత్తం 212 అర్జీలు అందాయి. కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశాలిచ్చారు.

మీడియాతో మాట్లాడుతూ మంత్రి ఇలా అన్నారు: ‘‘కృష్ణ, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాలను ప్రజా ప్రభుత్వం సాధించి తీరుతుంది. కేంద్రం ఇబ్బంది పెట్టినా వదిలిపెట్టేది లేదు. రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అవసరం. భారాస్‌ పార్టీ అడ్డుకోవాలని చూడటం సరికాదు. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు వైఖరి మార్చుకోవాలి.’’

గత భారాస్‌ ప్రభుత్వం నీటి వాటాల విషయంలో తెలంగాణకు తీవ్ర నష్టం కలిగించిందని కూడా ఆయన ఆరోపించారు.

Tags: