రాజకీయ కుట్రలో భాగాంగానే ఫోన్ ట్యాపింగ్ - పీసీసీ చీఫ్
కేవలం రాజకీయ కుట్రల్లో భాగంగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడానికి సిట్ ముందు హాజరయ్యారు. అనంతరం మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ లో నా ఫోన్ నెంబర్ ఉందని వాంగ్మూలం కోసం సిట్ అధికారులు నన్ను పిలిచారు. నిష్పక్షపాతంగా సిట్ అదికారులకు వివరాలు అందించానని మహేష్ గౌడ్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజాస్వామ్య విరుద్దమైన ఒక హేయమైన చర్య అని అన్నారు. 2023లో అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలసి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఫోన్ ట్యాపింగ్ పై సీయస్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలు లేకుండా చేయాలని చెడు ఆలోచనతో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని మహేష్ గౌడ్ మండిపడ్డారు. 2018లో ఫోన్ ట్యాపింగ్ కారణంగా కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. 650 మందికి పైగా కీలక కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేశారని మహేష్ గౌడ్ ఆరోపించారు. అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ, హోమ్ సెక్రటరీలు రాజకీయ నాయకులకు తలొగ్గి ట్యాపింగ్ జరిపించారని అన్నారు. హోదా లేని ప్రభాకరరావుని ఐజీ హోదాలో కూర్చోబెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారని, సిగ్గుతో తలదించుకునేలా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని మహేష్ గౌడ్ విమర్శించారు. ఎవ్వరినీ ఉపేక్షించకుడా ఫోన్ ట్యాపింగ్ తో సబంధాలు ఉన్న వాళ్ళందరినీ శిక్షించాలని మహేష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.