Speaker Issues Notices: కడియం శ్రీహరి, దానం నాగేందర్కు తక్షణ అఫిడవిట్ సమర్పణకు స్పీకర్ నోటీసులు
తక్షణ అఫిడవిట్ సమర్పణకు స్పీకర్ నోటీసులు
Speaker Issues Notices: శాసనసభ్యుల అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఈ ఇద్దరితోపాటు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయిన విషయం తెలిసిందే.
ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ వివరణలు సమర్పించగా.. వారిపై విచారణ కొనసాగుతోంది. కానీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం మరింత గడువు కావాలంటూ స్పీకర్ను కోరిన నేపథ్యంలో.. వారిద్దరికీ తాజాగా నోటీసులు పంపారు.
ఈ నోటీసుల్లో తక్షణమే అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని స్పీకర్ స్పష్టంగా ఆదేశించినట్టు సమాచారం. ఇవాళ్టితో 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ పూర్తికావడంతో.. మిగతా ఇద్దరినీ త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఈ నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది.
ఈ అనర్హత కేసులపై నాలుగు వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో స్పీకర్ విచారణను వేగవంతం చేశారు. విచారణ పూర్తయిన 8 మంది ఎమ్మెల్యేల విషయంలో న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్న అనంతరం త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్టు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.
ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉత్కంఠ నింపుతోంది. దీనిపై అందరి దృష్టీ కేంద్రీకరించింది.