Harishrao : అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం
కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్;
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కమిషన్ల పేరుతో కక్ష సాధింపులకు దిగుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు ఆరోపించారు. కాళేశ్వరం కమీషన్ వ్యవహారంలో పీసీఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై మంగళవారం తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే నివేదికలు న్యాయస్ధానం ముందు నిలబడవని హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా నత్తనడకన సాగుతోందని, విద్యార్థులు ఫీజు రీయంబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఓ పక్కన సాగు నీరు అందక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం కమిషన్ల పేరుతో కాలం గడుపుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు రెండు సార్లు కూలిపోతే ఎన్డీఎస్ఏ రాలేదని, మేడిగడ్డ బ్యారేజిలో రెండు పిల్లర్లు కుంగితే ఎన్డీఎస్ఏ వచ్చి ఆగమేఘాల మీద నివేదిక ఇచ్చిందన్నారు. కాళేశ్వరం కమిషన్ గడువు రాత్రికి రాత్రే పెంచారని హరీష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై చర్చపెడితే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతుందని హరీష్ రావు అన్నారు.