Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గౌరవం గురించి తమకు నేర్పించారని, కానీ వైసీపీ నేతలు తన తల్లిని సభలో అవమానించినప్పుడు ఈ విషయం గుర్తు చేసుకోలేదా అని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను సూటిగా ప్రశ్నించారు.

మంగళవారం జరిగిన శాసన మండలి చర్చలో, వరదు కళ్యాణిపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు సరికాదని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని లోకేష్ స్పష్టం చేశారు. బొత్స సభలో లేనప్పుడు తాను మాట్లాడినట్లు గుర్తు చేస్తూ, మహిళలను అవమానిస్తే ఆనందపడే వ్యక్తులం తాము కాదని వైసీపీ నేతలపై చురకలంటించారు. తన తల్లిని అవమానించిన వారు ఇప్పుడు మహిళల గౌరవం గురించి మాట్లాడటం వ్యంగ్యాస్పదమని, వైసీపీ నేతలు ఇప్పటికీ మహిళలను దారుణంగా అవమానిస్తున్నారని ఆరోపించారు. మహిళలపై కేసులు పెట్టినప్పుడు వైసీపీ నేతలు ఏం చేశారని లోకేష్ ప్రశ్నించారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున సభలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ, వైసీపీ నేతలకు అర్థం కావడం లేదా అని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ చర్చలో వైసీపీ నేతల వైఖరిపై లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు.

Tags: