Chandrababu : ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం లేకపోతే లాభం లేదు: చంద్రబాబు
ఆరోగ్యం లేకపోతే లాభం లేదు: చంద్రబాబు
Chandrababu : ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే ఏ వ్యవస్థ అయినా మనుగడ సాగించగలదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లలిత ఆసుపత్రి ల్యాండ్మార్క్ ఇన్స్టిట్యూట్గా రూపొందాలని ఆకాంక్షించారు.
“ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు. వేల కోట్లు, పదవులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు” అని చంద్రబాబు ఉద్ఘాటించారు.
లలిత ఆసుపత్రి 600 పడకల సామర్థ్యంతో, 900 మంది సిబ్బందితో ప్రారంభమైందని, 32 విభాగాల్లో వైద్య సేవలు అందించే ఏకైక కేంద్రమని తెలిపారు.
“సంజీవని” పేరుతో డిజిటల్ హెల్త్ రికార్డు ప్రాజెక్టును తీసుకొస్తున్నామని, పేదల ఆరోగ్యాన్ని కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంచి అలవాట్లు, యోగా, ధ్యానం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున్నామని, మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని ఆయన సూచించారు.