New Rules Alert: వాహనదారులకు హెచ్చరిక.. టోల్ ఫీజు కట్టకపోతే బండి అమ్మడం ఇక అసాధ్యం
టోల్ ఫీజు కట్టకపోతే బండి అమ్మడం ఇక అసాధ్యం
New Rules Alert: దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మల్టీ-లేన్-ఫ్రీ ఫ్లో అనే సరికొత్త సిస్టమ్ను తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు. కెమెరాలు ఆటోమేటిక్గా నంబర్ ప్లేట్ను గుర్తించి ఖాతా నుంచి డబ్బులు కట్ చేస్తాయి. అయితే చాలామంది ఫాస్టాగ్లో బ్యాలెన్స్ లేకుండా ప్రయాణించడం లేదా టెక్నికల్ కారణాల వల్ల టోల్ చెల్లించకపోవడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చారు.
కొత్త నిబంధనల ప్రకారం.. మీ వాహనంపై టోల్ బకాయిలు ఉంటే, మీరు కింది పనులు చేయడం అసాధ్యం..
వాహన బదిలీ: ఒకరి పేరు మీద ఉన్న బండిని మరొకరికి అమ్మడం లేదా బదిలీ చేయడం కుదరదు.
ఫిట్నెస్ సర్టిఫికేట్: కమర్షియల్ వాహనాలకు ఫిట్నెస్ రెన్యువల్ సర్టిఫికేట్ జారీ చేయరు.
పర్మిట్లు: ట్రాన్స్పోర్ట్ వాహనాలకు కొత్త పర్మిట్లు లేదా పాత వాటి రెన్యువల్ నిలిపివేస్తారు.
రీ-రిజిస్ట్రేషన్: బండిని ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి మార్చినప్పుడు ఇచ్చే ఎన్ఓసి లభించదు.
ఈ నిబంధనల కోసం ప్రభుత్వం ఫామ్ 28లో కూడా మార్పులు చేసింది. ఇప్పుడు బండిని బదిలీ చేసేటప్పుడు యజమాని స్వయంగా తనపై ఎటువంటి టోల్ బకాయిలు లేవని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బకాయిలు ఉంటే వాటి వివరాలను పొందుపరచాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్ పోర్టల్ ద్వారా పారదర్శకంగా నిర్వహించబోతున్నారు. బాకీ చెల్లించని వాహనదారులకు ముందుగా ఈ-నోటీసులు పంపిస్తారు, ఆ తర్వాత కూడా స్పందించకపోతే వారి ఫాస్టాగ్ ఖాతాను సస్పెండ్ చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే స్పష్టం చేసినట్లుగా.. 2026 నాటికి భారత రోడ్లను టోల్ గేట్లు లేని రోడ్లుగా మార్చడమే లక్ష్యం. ఈ బారియర్-ఫ్రీ టోలింగ్ వల్ల టోల్ వసూలు ఖర్చు 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గుతుంది. వాహనదారులకు సమయం ఆదాతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుంది. కాబట్టి సాధారణ వాహనదారులు ఇప్పుడు తమ ఫాస్టాగ్లో ఎప్పుడూ తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల టోల్ కట్ అవ్వకపోయినా, వెంటనే ఆ బకాయిని క్లియర్ చేయడం ఉత్తమం.