కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు

Update: 2025-05-20 10:20 GMT

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు పంపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి వ్యవహారానికి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. జూన్‌ 5వ తేదీ లోపు కమిషన్ ముందు హాజరుకావాలని పీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసుల్లో పేర్కొంది. అయితే, కేసీఆర్‌తో పాటు.. ఆ సమయంలో మంత్రులుగా పనిచేసిన హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు కూడా కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు పంపించింది.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌ పార్టీ మొదటినుంచీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాలంటూ జస్టిస్‌ పీసీ ఘోష్‌ అధ్యక్షతన ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ సుమారు యేడాది కాలంగా విచారణ సాగిస్తోంది. ఈ కమిషన్‌ గడువు ఈ నెలాఖరుతో ముగియనుండగా.. ఆ గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. జూలై 31వ తేదీ వరకు పీసీ ఘోష్ కమిషన్‌ విచారణకు గడువు ఉంది. దీంతో, కేసీఆర్‌ విచారణకు హాజరయ్యేందుకు జూన్‌ 5వ తేదీని గడువుగా విధించింది.

జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్ విచారణలో భాగంగా కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణంలో పనిచేసిన ఏఈలు, డీఈలు, ఎస్‌ఈలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులందరినీ విచారించింది. వారి నుంచి అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలాలు కూడా సేకరించింది. వాటిని క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో పాటు బహిరంగంగా కూడా విచారించింది. ప్రాజెక్టులను నిర్మించిన కంపెనీల ప్రతినిధులను సైతం కమిషన్‌ విచారించింది. అలాగే ఈ ప్రాజెక్ట్ డిజైన్లు చేసిన కంపెనీల ప్రతినిధులను కూడా కమిషన్ ప్రశ్నించింది. ఏడాది నుంచి పీసీ ఘోష్‌ కమిషన్‌ సుదీర్ఘంగా జరుపుతున్న ఈ విచారణలో అన్ని కోణాల్లోనూ విచారణ సాగిస్తోంది. దాదాపు అందరూ కూడా కేసీఆర్‌ పేరే చెప్పినట్లు సమాచారం. కాళేశ్వరం బ్యారేజీకి స్థలాల ఎంపిక నుంచి మొదలు కొని బ్యారేజీలకు సంబంధించి కీలక నిర్ణయాలు, చెల్లింపుల నిర్ణయాల్లో కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రమేయంతో జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వచ్చినట్లు సమాచారం. అలాగే కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు వచ్చిన వివరాలతో ఓ నివేదికను కూడా కమిషన్‌ సిద్ధం చేసింది.

అయితే, యేడాది పాటు విచారణ సాగించిన కమిషన్‌.. ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయకుండా రిపోర్ట్‌ ఇస్తే తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందని భావించిన కమిషన్.. కేసీఆర్‌ను కూడా స్వయంగా విచారించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే కేసీఆర్‌కు నోటీసులు పంపించిందని చెబుతున్నారు. అలాగే, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు కూడా మరోసారి నోటీసులు ఇచ్చారు. వచ్చే జూన్ 5వ తేదీలోపు వీళ్లు కమిషన్ ముందు హాజరై కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందిగా జస్టిస్ పీసీ ఘోష్ జారీచేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. జూన్ 5వ తేదీ లోపు వాళ్లు ఎంచుకున్న తేదీ అయినా లేదంటే కమిషన్ నిర్ణయించిన తేదీల్లో అయినా విచారణ హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? లేదంటే న్యాయపరంగా ఎదుర్కొంటారా? అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.



Tags:    

Similar News