కీర్తి కిరీటాలు... మన భారతీయ మహిళలు

Update: 2025-06-06 09:40 GMT

ముదితల్‌ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్‌ అన్నాడో కవి… కానీ నేటి మహిళ స్వతసిద్దంగా అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. ఫ్యాషన్‌, కళలు, టెక్నాలజీ, ఫైనాన్స్‌, క్రీడలు, స్టార్టప్‌ బిజినెస్‌ లు ఇలా ఒకటని కాదు ఏ రంగం చూసుకున్నా మహిళా మణులు తమ ప్రతిభతో రాణిస్తున్నారు. ఆయా రంగాల్లో కీలక మార్పులకు కారణభూతమవుతున్నారు. భారత దేశంలో ఉన్నత లక్ష్యాలను సాధించిన మహిళా మణులలను గుర్తించి కాండెర్ హురున్ ఇండియా  ప్రతి యేటా ఓ జాబితా ప్రకటించి వారిని సత్కరిస్తుంది. తాజాగా 2025 సంవత్సరానికి గానూ అటువంటి 97 మంది స్పూర్తిదాయకమైన భారతీయ మహిళల జాబితాను విడుద చేసింది. కాండెర్‌ హురున్‌ ఇండియా మహిళా నాయకుల పేరుతో ఈ జాబితా విడుదల చేసింది.

ఈ జాబితాలో నిలిచిన మహిళలు తమ అసాధారణమైన నాయకత్వ లక్షణాలతో దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు. మార్కెట్ లీడర్‌షిప్‌ను పరిగణనలోకి తీసుకుంటూ వారు నాయకత్వం వహిస్తున్న కంపెనీల విలువ ఆధారంగా అగ్రశ్రేణి 10 మంది మహిళా ప్రొఫెషనల్స్‌కు ర్యాంకులు ఇచ్చారు.

శాంతి ఏకాంబరం : కోటక్ మహీంద్రా బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన శాంతి ఏకాంబరం, తన కంపెనీ విలువ రూ.3.81 లక్షల కోట్లు కావడంలో చేసిన కృషికి ఫలితంగా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

పర్మిందర్ చోప్రా : పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన పర్మిందర్ చోప్రా, తన కంపెనీ విలువరూ.1.44 లక్షల కోట్లకు తీసుకువచ్చినందుకు గానూ శాంతి ఏకాంబరం తర్వాత స్థానంలో ఉన్నారు. ఈ జాబితా దేశంలోని ఆర్థిక కార్పొరేట్ రంగాలలో మహిళల ఆధిపత్యాన్ని తేటతెల్లం చేస్తుంది. అలాగే ఫస్ట్ జనరేషన్ వెల్త్ క్రియేటర్లుగా తమకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకున్న మహిళల జాబితాలో రాధా వేంబు ముందున్నారు.

రాధా వేంబు : జొహో సహ-వ్యవస్థాపకురాలు అయిన రాధా వేంబు రూ.55,300 కోట్ల వ్యక్తిగత సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆమె ఇండియా రిచ్ లిస్ట్ 2024, గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024, ఫిలాంత్రోపీ లిస్ట్ 2024 వంటి పలు ప్రతిష్టాత్మక జాబితాలలో కూడా స్థానం సంపాదించుకున్నారు.

జయశ్రీ ఉల్లాల్ : అరిస్టా నెట్‌వర్క్స్ సీఈఓ అయిన జయశ్రీ ఉల్లాల్, రూ.48,900 కోట్ల వ్యక్తిగత సంపదతో ఈ విభాగంలో ఆమె తర్వాతి స్థానంలో ఉన్నారు.

తమ స్వయంకృషితో సంపదను సృష్టించుకున్న మహిళల జాబితా ఇది. వ్యాపార విలువలు, ఇన్వెస్ట్ మెంట్ అసెట్స్ లను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు. నెక్ట్స్ జనరేషన్ నాయకుల జాబితాలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఛైర్‌పర్సన్ రోష్ని నాడర్ మల్హోత్రా మొదటి స్థానంలో నిలిచారు.

రోష్ని నాడార్ మల్హోత్రా : ఆమె నాయకత్వంలో హెచ్‌సీఎల్ టెక్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 60 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ రూ.1.11 లక్షల కోట్ల ఆదాయాన్ని సాధించింది. 2025 మార్చిలో శివ్ నాడార్ తన హెచ్‌సీఎల్ షేర్లలో 47 శాతం రోష్ని నాదర్ మల్హోత్రాకు బహుమతిగా ఇవ్వడంతో ఆమె మెజారిటీ వాటాదారుగా మారారు. దీనితో ఆమె భారతదేశంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా, ప్రపంచంలో ఐదవ అత్యంత సంపన్న మహిళగా అవతరించారు.

ముంబై మహిళా నాయకత్వానికి కేంద్రం!

ఈ జాబితాలో ఉన్న 97 మంది మహిళలలో 38 మంది ముంబై కేంద్రంగా పనిచేస్తున్నారు. దీనితో ముంబై భారతదేశంలో మహిళా నాయకత్వానికి అతిపెద్ద కేంద్రంగా అవతరించింది. ఢిల్లీ 12 మందితో, బెంగళూరు 10 మంది నాయకులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారతీయ యువ మహిళలు చాలా తక్కువ వయసులోనే నాయకత్వ స్థానాలను చేపడుతున్నారు. ఈ జాబితాలో ఉన్న మహిళల సగటు వయస్సు 51 సంవత్సరాలు. వారిలో సుమారు 25 శాతం మంది 26 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు వారు.

మృణాల్ పాంచల్ : 26 ఏళ్ల మృణాల్ పాంచల్, ఎంఆర్‌యూచా బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫౌండర్ విభాగంలో 5.5 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నారు.

శ్రద్ధా కపూర్ : అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీ ఇన్వెస్టర్ శ్రద్ధా కపూర్, 94.1 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో ముందున్నారు. ఆమె మైగ్లామ్, షూన్య వంటి బ్రాండ్‌లలో పెట్టుబడులు పెట్టారు.

దేవాన్షి కేజ్రీవాల్ : 28 ఏళ్ల దేవాన్షి కేజ్రీవాల్, స్కిల్‌మాటిక్స్ సహ-వ్యవస్థాపకురాలు, ఈ జాబితాలో అతి పిన్న వయస్సు గల వ్యాపార నాయకురాలు.

అర్పితా సింగ్ : మరోవైపు, 87 ఏళ్ల కళాకారిణి అర్పితా సింగ్ ఈ జాబితాలో అత్యంత వృద్ధురాలు. క్రియేటివిటీకి వయస్సుతో సంబంధం లేదని ఆమె నిరూపించారు.

రోహిణి నిలేకని : దాతృత్వ రంగంలో రోహిణి నిలేకని ప్రత్యేకంగా నిలిచారు. తన ఫౌండేషన్ ద్వారా రూ.154 కోట్లు విరాళంగా ఇచ్చారు.

Tags:    

Similar News