నటుడు శివాజీకి బిగ్ షాక్.. మహిళా కమిషన్ సీరియస్

మహిళా కమిషన్ సీరియస్

Update: 2025-12-24 05:05 GMT

నటుడు శివాజీకి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఆయన నటించిన 'దండోరా' సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసిన కమిషన్, డిసెంబర్ 27న తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని శివాజీని ఆదేశించింది.

ఇటీవల జరిగిన 'దండోరా' సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో శివాజీ మహిళల వస్త్రధారణపై వ్యాఖ్యలు చేశారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లోనే అందంగా కనిపిస్తారని, చీర కట్టుకుంటే ఆ అందం మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇదే క్రమంలో ఆయన కొన్ని అభ్యంతరకర పదాలను వాడారని ఆరోపణలు వచ్చాయి. మహిళలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా దుస్తులు ధరించకపోతే, ఇతరులు వారిని చూసి వెక్కిరించే అవకాశం ఉంటుందనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడటం వివాదానికి దారితీసింది.

శివాజీ వ్యాఖ్యలు సాధారణంగా మహిళలను, ముఖ్యంగా తెలంగాణ మహిళలను కించపరిచేలా ఉన్నాయని మహిళా కమిషన్ అభిప్రాయపడింది. "సమాజంలో మహిళల ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతోనే మీరు ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రాథమికంగా అర్థమవుతోంది. అందుకే తెలంగాణ మహిళా కమిషన్ చట్టం-1998లోని సెక్షన్ 16 (1) (బి) కింద విచారణ చేపట్టాలని నిర్ణయించాం" అని కమిషన్ కార్యదర్శి పేర్కొన్నారు. విచారణకు సహకరించాలని, సంబంధిత పత్రాలతో హాజరుకావాలని ఆదేశించారు.

వివాదం ముదరడంతో శివాజీ మంగళవారం ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. తన వ్యాఖ్యల పట్ల ఆయన బహిరంగంగా క్షమాపణలు కోరారు. "నేను ఏదో మంచి చెప్పబోయి, పొరపాటున రెండు అనుచిత పదాలను వాడాను. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. నా వ్యాఖ్యలు మహిళలందరినీ ఉద్దేశించినవి కావు. నటీమణులు బయటకు వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు ఎదురుకావనే ఉద్దేశంతోనే అలా అన్నాను" అని వివరణ ఇచ్చారు. తనకు మహిళలంటే ఎంతో గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News