ముంబై, ఆగస్టు 27, 2026 : సినీ, టీవీ కళాకారుల సంఘం CINTAA (Cine & TV Artistes' Association)లో రాజ్యాంగ సంక్షోభం నెలకొంది. ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది ఎన్నికైన సభ్యుల్లో 8 మంది రాజీనామా చేయడంతో కమిటీ రాజ్యాంగబద్ధంగా రద్దయిందని మాజీ ప్రధాన కార్యదర్శి ఉపాస్నా సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో FWICE పర్యవేక్షణలో తాజా ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించాలని ఆమె డిమాండ్ చేశారు.

50 శాతానికి పైగా సభ్యుల రాజీనామా

CINTAA ఎగ్జిక్యూటివ్ కమిటీలో మొత్తం 15 మంది ఎన్నికైన సభ్యులు ఉండగా.. వారిలో 8 మంది తమ పదవులకు రాజీనామా చేశారని ఉపాస్నా సింగ్ వెల్లడించారు. దీంతో 50 శాతానికి పైగా ఎన్నికైన స్థానాలు ఖాళీ అయ్యాయని తెలిపారు.

CINTAA రాజ్యాంగంలోని ''క్లాజ్ 18(F)(iii)'' ప్రకారం సగానికి పైగా ఎన్నికైన పదవులు ఖాళీ అయిన వెంటనే ఎగ్జిక్యూటివ్ కమిటీ రద్దవుతుందని.. అనంతరం తాజా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

FWICE జోక్యంతో కొత్త ఎన్నికలకు మార్గం

కమిటీ రద్దైన నేపథ్యంలో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా తాజా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ తాను ''Federation of Western India Cine Employees (FWICE)''ను ఆశ్రయించినట్లు ఉపాస్నా సింగ్ తెలిపారు.

CINTAAకు చట్టబద్ధంగా ఎన్నికైన కొత్త కమిటీని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని FWICE స్పష్టం చేసిందని ఆమె వెల్లడించారు.

మాజీ పదాధికారులపై ఆరోపణలు

కమిటీ రద్దైన తర్వాత కూడా మాజీ అధ్యక్షురాలు ''పూనమ్ ధిల్లాన్'', మాజీ ఉపాధ్యక్షురాలు ''పద్మిని కొల్హాపురే'' పదవుల్లో ఉన్నట్లుగా వ్యవహరిస్తూ సమావేశాలు నిర్వహించడం, ప్రకటనలు జారీ చేయడం, తీర్మానాలు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఉపాస్నా సింగ్ ఆరోపించారు.

కమిటీ రాజ్యాంగబద్ధంగా రద్దైన తర్వాత మాజీ పదాధికారులకు సమావేశాలు నిర్వహించడం, నోటీసులు జారీ చేయడం, CINTAA తరఫున నిర్ణయాలు తీసుకోవడం వంటి అధికారాలు ఉండవని FWICE స్పష్టం చేసిందని తెలిపారు.

లేబర్ కమిషనర్ కీలక సూచనలు

ముంబైలోని కోంకణ్ డివిజన్ అదనపు లేబర్ కమిషనర్ కార్యాలయం ఆగస్టు 10న జారీ చేసిన కమ్యూనికేషన్‌లో కూడా ఈ పరిణామాలను ప్రస్తావించినట్లు ఉపాస్నా సింగ్ తెలిపారు.

రద్దైన ఎగ్జిక్యూటివ్ కమిటీ పేరుతో తదుపరి సమావేశాలు నిర్వహించడం, తీర్మానాలు చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సంబంధిత సభ్యులకు లేబర్ అథారిటీ సూచించినట్లు వెల్లడించారు.

అయితే ఈ సూచనల తర్వాత కూడా కొందరు వ్యక్తులు సమావేశాలు నిర్వహిస్తూ తీర్మానాలు చేస్తున్నారని.. ఇది CINTAA రాజ్యాంగానికి విరుద్ధమని ఆమె ఆరోపించారు.

పాలన తీరుపై సభ్యుల్లో అసంతృప్తి

గత ఎగ్జిక్యూటివ్ కమిటీలోని పలువురు సభ్యులు మాజీ అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్, మాజీ ఉపాధ్యక్షురాలు పద్మిని కొల్హాపురే వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారని ఉపాస్నా సింగ్ తెలిపారు.

ముఖ్యమైన నిర్ణయాలను ఎన్నికైన సభ్యులతో సమిష్టిగా చర్చించి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. నిర్ణయాలు కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయని సభ్యులు భావించినట్లు పేర్కొన్నారు.

ఎన్నికైన ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందే నిర్ణయించిన అంశాలను ఆమోదించే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

'ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు'

CINTAAలో జరుగుతున్న పరిణామాలను వ్యక్తిగత వ్యక్తుల మధ్య పోరాటంగా చూడకూడదని ఉపాస్నా సింగ్ అన్నారు. ఇది ''ప్రజాస్వామ్య పాలన, రాజ్యాంగబద్ధ జవాబుదారీతనం, సభ్యుల హక్కులను కాపాడే పోరాటం'' అని పేర్కొన్నారు.

CINTAA ఒక ప్రజాస్వామ్య సంస్థ అని.. వ్యక్తిగత ఆధిపత్యం లేదా ఏకపక్ష నిర్ణయాలకు వేదిక కాదని స్పష్టం చేశారు.

సభ్యుల హక్కులే ప్రాధాన్యం

CINTAA సభ్యుల హక్కులు, ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని ఉపాస్నా సింగ్ అన్నారు. ఏ వ్యక్తి లేదా వర్గం సంఘ రాజ్యాంగం కంటే పై స్థాయిలో ఉండకూడదని పేర్కొన్నారు.

FWICE పర్యవేక్షణలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలు నిర్వహించి కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

''CINTAAకు సంబంధించిన తాజా పరిణామాలపై ఆగస్టు 27న నిర్వహించే మీడియా సమావేశంలో రాజ్యాంగ సంక్షోభం, మాజీ పదాధికారుల వ్యవహారం, లేబర్ కమిషనర్ సూచనలు, తాజా ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఉపాస్నా సింగ్ మరింత వివరాలు వెల్లడించనున్నారు.''

Tags: