Under-19 World Cup 2026: వైభవ్ విధ్వంసం..ఆరోసారి అండర్ 19 వరల్డ్ కప్ టీమిండియాదే
ఆరోసారి అండర్ 19 వరల్డ్ కప్ టీమిండియాదే
Under-19 World Cup 2026: భారత అండర్-19 జట్టు అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ 2026 అండర్-19 ప్రపంచ కప్ను ముద్దాడింది. జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి, భారత్ రికార్డు స్థాయిలో 6వ సారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. భారత్ 100 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 411/9 (ఈ టోర్నీ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు) పరుగులు చేసింది. మొత్తంగా టోర్నీలో ఓటమే లేకుండా ట్రోఫీ గెలిచిన మన కుర్రాళ్లు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు.
ఈ మ్యాచ్లో 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేశాడు (15 ఫోర్లు, 15 సిక్సర్లు). అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్','ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు లభించాయి.ఇతర కీలక ఆటగాళ్లు ఆయుశ్ మాత్రే (కెప్టెన్) 53 పరుగులతో రాణించి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు.
412 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బ్యాటర్ కాలెబ్ ఫాల్కనర్ (115) సెంచరీతో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, లక్ష్యం భారీగా ఉండటంతో ఆ జట్టు ఓటమి తప్పలేదు. భారత్ తరపున ఆర్.ఎస్. అంబరీష్ (3 వికెట్లు), దీపేశ్ దేవేంద్రన్ , కనిష్క్ చౌహాన్ కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ను దెబ్బతీశారు. వరుసగా రెండుసార్లు (2022, 2026) ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి భారత్ టైటిల్ గెలవడం విశేషం.