Lord Venkateswara Swamy’s Brahmotsavams: వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Lord Venkateswara Swamy’s Brahmotsavams: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 07వ తేదీన అంకురార్పణ జరుగనుంది. ఆలయంలో ఫిబ్రవరి 08 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 07వ తేదీ శనివారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 8న ఉదయం 8.15 నుండి 8.35 గంటల మధ్య కుంభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. అంతకుముందు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనుంది. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. శ్రీనివాస మంగాపురం పరిసర గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. వాహనసేవల సమయంలో భక్తులకు అన్న ప్రసాదాలు, మజ్జిగ, పాలు, తాగునీరు, వైద్య, పార్కింగ్, క్యూలైన్లు, భద్రత తదితర సేవలను అందించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయం, పరిసర ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు అలంకరణకు సంబంధించి దాదాపు 10 టన్నుల పుష్పాలను వినియోగించనున్నారు. ఇందులో సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీజాతుల పుష్పాలు కూడా ఉన్నాయి. వాహనసేవల్లో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించనున్నారు. దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడు శ్రీ చిన తిరుమలయ్య పునరుద్ధరించినారు. ప్రకృతి వైపరీత్యాలకు యవనుల దండయాత్రలకు లోలై శిథిలమైన ఈ గుడి, గోపురాలను పునర్నిర్మించి శ్రీవేంకటేశ్వర స్వామి వారికి నిత్యపూజా నైవేద్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు, ఊరేగింపులను చినతిరుమలయ్య నిర్వహించినట్లు 22 మార్చి, 1540 సంవత్సరం నాటి శాసనం చెబుతోంది. అర్చకులు సుందరాజ స్వామివారి నుండి 1967లో తిరుమల తిరుపతి దేవస్థానములు వారు చేపట్టి శ్రీవైఖానస ఆగమోక్తంగా దేవాలయ పునరుద్ధరణ, భక్తులకు వసతులు, నిత్య దిట్టం ఏర్పాటు చేసి శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. 1981 నుండి శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం, సాక్షాత్కార, బ్రహ్మోత్సవ వైభవాలను నిర్వహిస్తున్నారు. నంవబర్ 2007లో మహా సంప్రోక్షణ అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించింది.