Char Dham Yatra 2026: హిందువుల అత్యంత పవిత్రమైన చార్ ధామ్ యాత్ర 2026 సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఏడాది కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తులు తమ ప్రయాణ బడ్జెట్‌ను కొంచెం పెంచుకోవాల్సిందే. బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ప్రత్యేక పూజా రుసుములను, హెలికాప్టర్ సేవల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

హెలికాప్టర్ సర్వీసులు - కొత్త ధరలు:

ఈసారి కొత్త టెండర్ ప్రక్రియ ద్వారా ఎనిమిది ఆపరేటర్లు సేవలు అందిస్తున్నారు. వివిధ మార్గాల్లో వన్-వే ప్రయాణ ఛార్జీలు, బుకింగ్ ఛార్జీలు అదనం) ఈ విధంగా ఉన్నాయి..

గుప్తకాశీ - కేదార్‌నాథ్: రూ. 6,077

ఫాటా - కేదార్‌నాథ్: రూ. 4,840

సిర్సి - కేదార్‌నాథ్: రూ. 3,043

గత ఏడాదితో పోలిస్తే ఫాటా మార్గంలో ధరల పెంపు అధికంగా ఉండగా, సిర్సి మార్గం యాత్రికులకు కొంత అందుబాటులో ఉంది.

కేదార్‌నాథ్‌లో పూజా రుసుముల భారీ పెంపు:

కేదార్ నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజల ధరలు దాదాపు 78% మేర పెరిగాయి.

ఒకరోజు పూజ: రూ. 28,600 నుంచి రూ. 51,000 కు పెరిగింది.

మహాభిషేకం: రూ. 11,500

రుద్రాభిషేకం: రూ. 7,500

అఖండ జ్యోతి ప్రజ్వలన: రూ. 5,100

శివ సహస్రనామ పఠనం: రూ. 2,500

బద్రీనాథ్ ధామ్‌లో సవరించిన ధరలు:

బద్రీనాథ్ లోనూ ఆధ్యాత్మిక సేవలకు అయ్యే ఖర్చు పెరిగింది.

శ్రీమద్ భాగవత కథ: గతంలో రూ. 51,000 ఉండగా, ఇప్పుడు రూ. 1,00,000కు చేరింది.

మహాభిషేకం: రూ. 5,500

వేద, గీతా పారాయణం: రూ. 6,000

అఖండ జ్యోతి: రూ. 5,100

భక్తులకు ఊరటనిచ్చే అంశం:

ధరలు పెరిగినప్పటికీ, సాధారణ భక్తుల కోసం ఆలయ కమిటీ ఒక ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఆలయాల్లో నిర్వహించే సాంప్రదాయక సాధారణ దర్శనం యధావిధిగా పూర్తిగా ఉచితంగానే ఉంటుంది. ప్రత్యేక పూజలు, హెలికాప్టర్ ప్రయాణం కోరుకునే వారు మాత్రమే ఈ అదనపు భారాన్ని భరించాల్సి ఉంటుంది.

చార్ ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు ఆన్‌లైన్ బుకింగ్ చేసేటప్పుడు అదనపు GST, సర్వీస్ ట్యాక్స్‌లను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా భక్తుల సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తామని ఆలయ కమిటీ స్పష్టం చేసింది.

Tags: