Lakshmi Narasimha Swamy in Lingam Form: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని సింగోటం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అత్యంత విశిష్టమైనది. సాధారణంగా నరసింహస్వామి విగ్రహ రూపంలో లేదా శిల్ప రూపంలో కనిపిస్తారు, కానీ ఇక్కడ 'లింగ' రూపంలో దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత.

ఆలయ విశిష్టత

ఇక్కడి స్వామివారు శివలింగాన్ని పోలిన ఆకారంలో ఉంటారు. అందుకే భక్తులు ఈయన్ని "శైవ నాగలింగ నరసింహస్వామి" అని కూడా పిలుస్తారు. హరిహర అద్వైతానికి (శివ కేశవుల అభేదానికి) ఇది ఒక గొప్ప నిదర్శనం.ఈ విగ్రహం భూమిలో నుంచి స్వయంభూవుగా వెలసిందని స్థల పురాణం చెబుతోంది.ఆలయం పక్కనే ఉన్న సింగోటం చెరువు (సముద్రం లాంటి పెద్ద జలాశయం) పర్యాటకులను , భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది.ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేస్తే రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం,

స్థల పురాణం

పురాణాల ప్రకారం, పూర్వం ఒక రైతు పొలం దున్నుతుండగా నాగలికి రాయి తగిలి రక్తం వచ్చిందట. ఆ రాత్రి నరసింహస్వామి ఆ రైతు కలలో కనిపించి, తాను అక్కడ లింగ రూపంలో ఉన్నానని చెప్పడంతో, అప్పటి సురభి వంశపు రాజులు అక్కడ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది.

ప్రధాన ఉత్సవాలు

ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ముఖ్యంగా ఇక్కడి రథోత్సవం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఈ ఆలయం ఇప్పుడు శ్రీశైలం - వెల్దండ - కొల్లాపూర్ పర్యాటక సర్క్యూట్‌లో ఒక ముఖ్యమైన భాగంగా మారింది

Tags: