Lord Kodandarama:  తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సోమవారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఆల‌య నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను నివారిస్తుంది. వాహ‌న‌సేవ‌లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి అహ్మదాబాద్‌కు చెందిన Arihant Dyestuff Private Limited సంస్థ ప్రతినిధులు సోమవారం రూ.11 లక్షల విరాళం అందించారు. పేద రోగులకు వైద్య సేవలకు ఉపయోగించాలనే సంస్థ ప్రతినిధుల కోరిక మేరకు తిరుపతికి చెందిన శ్రీ వై. రాఘవేంద్ర ఈ విరాళాన్ని అందజేశారు. తిరుపతిలోని పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ను కలిసి రూ.11 లక్షల డీడీని ఆయన అందజేశారు.

Tags: