వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు
గరుడ వాహనంపై విహరించిన శ్రీ పద్మావతీ అమ్మవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు బుధవారంతో వైభవంగా ముగిశాయి. ఐదోరోజుల పాటు తెప్పోత్సవాలను నిర్వహించారు. చివరి రోజు పద్మ సరోవరంలో శ్రీ పద్మావతీ అమ్మవారు తెప్పపై ఏడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, నిర్వహించారు. మధ్యాహ్నం 03.00 నుండి 4.30 గంటల వరకు స్వామి వారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.15 గంటల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది.
గరుడ వాహనంపై శ్రీ పద్మావతీ అమ్మవారు...
అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో గరుడ వాహనంపై ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ చలపతి ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.