Tirumala Tirupati Devasthanams (TTD): శ్రీ వరలక్ష్మీ వ్రతానికి తిరుచానూరులో విస్తృత ఏర్పాట్లు
విస్తృత ఏర్పాట్లు
Tirumala Tirupati Devasthanams (TTD): తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21న జరగనున్న పవిత్ర శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవం సందర్భంగా పాల్గొనే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు.
బుధవారం తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ అధికారులు, అర్చకులు చైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవానికి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, సక్రమమైన క్యూ లైన్లు, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వ్రతంలో పాల్గొనేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, వ్రతం నిర్వహించే ఆస్థాన మండపాన్ని సుందరమైన పుష్పాలంకరణలతో శోభాయమానంగా అలంకరించి, మహోత్సవానికి తగిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాలని సూచించారు.
అనంతరం చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణలతో ఆశీర్వచనం అందజేశారు.
ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ పట్టువస్త్రాలు సమర్పించి, శ్రీ వరలక్ష్మీ వ్రత మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.