యజ్ఞంలా టిటిడి అన్నప్రసాద వితరణ

Update: 2025-06-11 12:31 GMT
  • రూ. 44 లక్షల డొనేషన్‌ తో దాత పేరు మీద రోజంతా అన్నప్రసాదం
  • రోజుకు 2.5 లక్షల మందికి అన్నప్రసాద పంపిణీ
  • టీటీడీ పౌర సంబంధాల శాఖ ప్రకటన

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టిటిడి నిరంతర యజ్ఞంగా ఉచిత అన్నప్రసాదం అందిస్తోందని టీడీపీ ప్రజా సంబంధాల విభాగం ఓ ప్రకటనలో తెలియజేసింది. 1985, ఏప్రిల్‌ 6న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదాన పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ చేతులమీదుగా టిటిడి ప్రారంభించింది. తదుపరి 1994, ఏప్రిల్‌ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా, తర్వాత దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా నామకరణం చేశారు. మొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్‌లో అన్నదానం జరిగేది. ఇప్పటి వరకు శ్రీ వైంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు దాతలు దాదాపు రూ. 2,190 కోట్ల విరాళాలను అందించారు. ఎందరో దాతలు ఇచ్చిన నిధులతో నిర్విరామంగా అన్నప్రసాద వితరణ సాగుతోంది.

వ్యక్తిగతంగా దాతల పుట్టిన రోజు, దాతల కుటుంబ సభ్యుల పేర్లతో, దాతల ట్రస్ట్ లు, కంపెనీల పేరుతో రూ.44 లక్షలు అందించవచ్చు. శ్రీవారి పుట్టిన రోజు అయిన శ్రవణా నక్షత్రం, శ్రీ పద్మావతీ అమ్మవారి పుట్టిన రోజు అయిన ఉత్తరషాడ నక్షత్రం, పంచమి తీర్థం, వైకుంఠ ఏకాదశి, శ్రీవారి, శ్రీపద్మావతీ అమ్మవారి ప్రత్యేక రోజులలో కూడా దాతలు విరాళంగా అందించవచ్చు. రూ. 44 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులు ప్రత్యేకంగా అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టిటిడి కల్పించింది. విరాళం అందించే దాతల పేరును తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని డిస్ ప్లే బోర్డులో ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఒకరోజు అన్నప్రసాదాలను వడ్డిస్తారు. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తారు. తిరుమల, తిరుపతి, ఒంటిమిట్టలోని టిటిడి అన్నప్రసాదాలు వితరణ కేంద్రాల నుండి రోజుకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి సుమారు 2.5 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు.

దాతలు రూ.44 లక్షలు అన్నప్రసాద వితరణకు విరాళం అందిస్తే, ఆ రోజంతా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ -1లోని 20, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ - 2లోని 31 కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్ మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టిబీసీ, పీఏసీ - 2, పీఏసీ - 4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకు బయటి క్యూలైన్లు, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, శ్రీగోవిందరాజ స్వామి ఆలయ అన్నప్రసాదరణ వితరణ కేంద్రం, రుయా ఆస్పత్రి, స్విమ్స్‌, మెటర్నిటి ఆస్పత్రి, బర్డ్‌, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనం, ఒంటిమిట్టలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం పంపిణీ చేస్తామని టీటీడీ ప్రజా సంబంధాల విభాగం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Tags:    

Similar News