TTD Issues Orders to Officials : భక్తుల ఏర్పాట్లపై అధికారులకు టీటీడీ ఆదేశాలు
అధికారులకు టీటీడీ ఆదేశాలు
TTD Issues Orders to Officials : తిరుమలలో భక్తుల భద్రతే పరమావధిగా బుతువులవారీ SOP( Pilgrim operations on seasonal basis) తీసుకురావాలని అధికారులకు తి.తి.దే అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశించారు.
వర్షాకాలం నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణలతో కలిసి, ఇతర తి.తి.దే అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
డిజాస్టర్ రెస్పాన్సివ్ టీమ్ ను కమాండ్ కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేసి చీఫ్ ఇంజనీర్ గారి నేతృత్వంలో విపత్తు స్పందన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందులో భాగంగా పురాతన గోపురాలు మరియు కట్టడాల ధృడత్వం మరియు సంరక్షించే చర్యలలో భాగంగా ఒక సంస్థాగత విభాగం ఉంటే సబబుగా ఉంటుందని అభిప్రాయం వెలిబుచ్చారు.
భారీ వర్షాలకు భక్తులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. వర్షం సమయంలో భక్తులకు వేడివేడిగా అన్న ప్రసాదాలు అందించేందుకు సమయపాలనా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో క్యూలైన్లు బయటకు రాకుండా ఉన్న మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. దీనికి అనుగుణంగా SSD టోకెన్ల జారీ తగ్గింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా సర్వదర్శనం భక్తులు త్వరగా నారాయణగిరి షెడ్లకు చేరుకోడానికి వీలుకలుగుతుందని తెలిపారు.
భారీ వర్షాలకు కొండ చరియలు, చెట్లు విరిగిపడితే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు జేసీబీ వాహనాల ద్వారా తొలగించాలన్నారు. అటవీశాఖ మరియు రవాణా విభాగం వారికి సదరు ఆదేశాలు జారీచేయడమైనది.
కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తి.తి.దే లోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమస్యలు ఎదురైనప్పుడు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.