Kashi Vishwanath Temple: జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన పుణ్యక్షేత్రం కాశీ..ఎందుకంటే.?
ఎందుకంటే.?
Kashi Vishwanath Temple: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, సజీవమైన నగరం ఏదైనా ఉందంటే అది ఒక్క కాశీ మాత్రమే. "కాశ్యాం తు మరణాన్ముక్తిః" - అంటే కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదని, సాక్షాత్తు ఆ పరమశివుడే తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని కోట్లాది మంది భారతీయుల నమ్మకం.
గంగానది ఒడ్డున వెలసిన ఈ నగరం కేవలం ఒక ఊరు కాదు, అదొక ఆధ్యాత్మిక అనుభూతి. ఇక్కడ ప్రవహించే గంగమ్మ తల్లి పాపాలను కడిగేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కాశీ అంటేనే 'ప్రకాశించేది' అని అర్థం. జ్ఞానానికి, మోక్షానికి మార్గదర్శి ఈ నగరం. ఇక్కడ కొలువై ఉన్న కాశీ విశ్వేశ్వరుడు బ్రహ్మాండానికి అధిపతి అయితే, అన్నపూర్ణా దేవి లోకానికి ఆకలి తీర్చే తల్లి.
కాశీలోని గట్లు (Ghats) ఒక్కోటి ఒక్కో చరిత్రను చెబుతాయి. దశాశ్వమేధ ఘాట్ వద్ద జరిగే సాయంత్రం గంగా హారతి చూస్తుంటే.. స్వర్గం భూమిపైకి దిగివచ్చిందా అనిపిస్తుంది. మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లు జీవితం యొక్క పరమార్థాన్ని, మరణం యొక్క సత్యాన్ని మనకు గుర్తుచేస్తాయి. సూర్యోదయ వేళ గంగానదిలో పడవ ప్రయాణం చేస్తూ, ఆ ఘాట్ల సౌందర్యాన్ని చూడటం జీవితంలో మర్చిపోలేని అనుభూతి.
అంతేకాదు, కాశీ విద్యకు, కళలకు కూడా నిలయం. ఇక్కడి సందులు, గల్లీలు, ఆ వీధుల్లో వినిపించే వేద మంత్రాలు, రుద్రాక్ష మాలలు ధరించిన సాధువులు.. ఇవన్నీ మనల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి. ఇక్కడ అడుగుపెడితే మనసులోని అశాంతి తొలగిపోయి, ఒక తెలియని ప్రశాంతత ఆవహిస్తుంది.జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన పుణ్యక్షేత్రం కాశీ. శివుని త్రిశూలంపై నిలబడి ఉందని పురాణాలు చెప్పే ఈ క్షేత్రం, భారతీయ సంస్కృతికి వెన్నెముక.