డీఎడ్ కోర్సుకు పూర్వ వైభవం

Candidates rejoice as D.Ed regains its former glory;

Update: 2025-05-22 09:35 GMT

డీఎడ్ కోర్సుకు పూర్వ వైభవం రాబోతోంది. కోర్సు పూర్తి చేసిన వారు తక్కువగా ఉండటం, సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టు లు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది అభ్యర్థులు అటువైపుగా ఆసక్తి చూపుతున్నారు. ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను 70% భర్తీ చేయడం, 30% మాత్రమే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయడంతో ప్రతీ డీఎస్సీలోనూ ఎస్జీటీ ఖాళీలు ఎక్కువగా ఉంటున్నాయి. 2024లో ప్రభుత్వం 11వేలకు పైచిలుకు టీచర్ పోస్టులు భర్తీ చేసింది. అందులో 7 వేలకు పైగా ఎస్జీటీ పోస్టులే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో డీఈడీ కోర్సుకు డిమాండ్ పెరిగింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే డీఈఈసెట్ పరీక్ష ఈ నెల 25న జరగనుంది. అర్హత పరీక్షకు ఈ ఏడాది 43,616 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

2024లో 17,656 దరఖాస్తులు రాగా, 2023లో మరీ తక్కువగా 6,486 దరఖాస్తులే వచ్చా యి. 2024లో అధికశాతం చిన్న వయసులో టీచర్ ఉద్యోగాలు సాధించడంతో ఈసారి అభ్యర్థుల నుంచి భారీ స్థాయిలో అర్జీలు వచ్చాయి. ఒకప్పుడు డీఈడీ కోర్సుకు ఫుల్ డిమాండ్ ఉండేది. 2012 సమయంలోనే మేనేజ్‌మెంట్ సీటు ధర రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పలికేది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైమ రీ తరగతులకు బోధించాలంటే డీఎడ్ చేసి ఉండాల్సిందే. ఆపై తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు బీఎడ్ అర్హత ఉండాలి. 2018లో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌తోపాటు, బీఎడ్ అభ్యర్థులూ అర్హులని జాతీయ ఉపాధ్యాయ మండలి ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు డీఎస్సీ నోటిఫికేషన్లు రాకపోవడంతో డీఈడ్‌కు డిమాండ్ తగ్గింది. అయితే ఎస్జీటీ పోస్టులకు కేవలం డీఎడ్ అభ్యర్థులే అర్హులంటూ 2023లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

గతేడాది 11 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులతో వేసిన డీఎస్సీలో దాదాపు ఏడు వేల వరకు ఎస్జీటీ పోస్టులుంటే వాటికి పోటీ పడింది 60 వేల మంది అభ్యర్థులే. మొన్నటి డీఎస్సీలో దాదాపు 30 జిల్లాల్లో వందకు పైగా ఎస్జీటీ ఖాళీలున్నాయి. అదే ఎస్‌ఏ పోస్టులు మాత్రం సింగిల్ డిజిట్‌లోనే ఉన్నాయి. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో డీఈఈసెట్ ఎంట్రెన్స్ రాసి డీఎడ్ చేసిఉంటే ఎస్జీటీ సాధించవచ్చన్న ఆలోచనలో అభ్యర్థులున్నారు.

డీఎడ్‌కు కొంతకాలంగా డిమాండ్ పడిపోవడంతో రాష్ట్రంలోని పలు ప్రైవేట్ డీఎడ్ కాలేజీలు మూత బడ్డాయి. ఒకప్పుడు 220 డీఎడ్ కాలేజీలుంటే ప్రస్తుతం వాటి సంఖ్య 80కి తగ్గింది. గతంలో దాదాపు 11,500 వరకు సీట్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు 4 వేలకు పడిపోయింది. డీఎడ్‌కు మళ్లీ పూర్వవైభవం రావటంతో కాలేజీల యాజమాన్యాలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News