అడవితల్లి బాట పనులు వేగవంతం
డోలీరహిత గిరిజన నివాసాలు ప్రభుత్వ లక్ష్యం;
గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో రహదారి పనుల స్థితిగతులపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పీఎం జన్ మన్ పథకంతోపాటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఉప ప్రణాళిక నిధులు కలిపి రూ.1005 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టారు. అడవి తల్లి బాట పేరుతో రెండు దశల్లో చేపట్టిన పనుల్లో స్వాతంత్రం వచ్చాక ఇప్పటి వరకు రహదారి సౌకర్యం లేని గిరిజన ఆవాసాలను సైతం అనుసంధానించేలా రోడ్లు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అధికారులు ఈ పనుల పురోగతిని వివరిస్తూ పనులు వేగంగా చేయడానికి ఎదురవుతున్న సవాళ్లను, అవరోధాలను అధికారులు తెలిపారు. కొండలపై ఉన్న ఆవాసాలను అనుసంధానిస్తూ కొత్త రోడ్డు రూపకల్పన చేసేందుకు బండరాళ్లను బద్ధలుకొడుతూ ముందుకు వెళ్ళేందుకు అధిక సమయం తీసుకొంటోందని తెలిపారు. అదే విధంగా నిటారుగా ఉన్న ప్రాంతాలు కావడంతో రోడ్ల నిర్మాణంలో పలు జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉండటంతో పనుల వేగం తగ్గింద్దని వివరించారు. 128 రోడ్లు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండడం వల్ల అటవీ అనుమతులు కోరగా ఇప్పటికే 98 రోడ్లకు వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు 186 పనులు చేపట్టగా, మరో 20 పనులు టెండర్ దశలో ఉన్నట్టు అధికారులు వివరించారు. టెక్నికల్ ఎవాల్యుయేషన్ ప్రక్రియ చేపడుతున్నామన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందిస్తూ “గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం – డోలీరహిత గిరిజన ఆవాసాలు ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం జన్ మన్ పథకం ద్వారా రూ.555.6 కోట్లు నిధులు కేటాయించి సహకారం అందించింది. అదే విధంగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకొంటున్నాము. ఇన్ని అవకాశాలు ఉన్నందున అడవి తల్లి బాట పనుల విషయంలో అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. నిరంతర పర్యవేక్షణతోనే పనులను వేగవంతం చేయగలం. ఇప్పటి వరకూ రహదారి సౌకర్యం లేని ప్రాంతాలలో కొత్తగా రోడ్లు నిర్మిస్తున్నాము. సవాళ్ళు, అవరోధాలు ఎదురైతే ప్రణాళికాబద్ధంగా అధిగమించాలి. అటవీ శాఖ నుంచి రావలసిన అనుమతులపై త్వరలోనే ఆ శాఖతో సమీక్ష నిర్వహించి ఆ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయిస్తాము.
స్వాతంత్రం వచ్చాక తొలిసారి రోడ్డు సౌకర్యం పొందే ఆవాసాలు కూడా ఉన్నాయి. కాబట్టి గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన ఈ పనుల గురించి స్థానికులకు కూడా తెలియచేయడం ఎంతో అవసరం. డోలీరహిత ఆవాసాలు ఉండాలనే సంకల్పంతో చేపట్టిన విషయాన్ని చెప్పాలి. తద్వారా వారి సహకారం, ప్రోత్సాహం కూడా లభిస్తుంది” అన్నారు.