ఎర్రకోట వద్ద పెద్ద ఎత్తున చోరీ.. కోట్ల విలువైన బంగారు వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు.
కోట్ల విలువైన బంగారు వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు.
ఎర్రకోట ప్రాంగణంలో జైన మతానికి చెందిన దసలక్షణ మహాపర్వ్ కార్యక్రమం సందర్భంగా భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.1.5 కోట్ల విలువైన బంగారు కలశాలు, ఇతర విలువైన వస్తువులను దొంగ ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక అతిథిగా హాజరైన సమయంలో ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.
ఈ బంగారు వస్తువులు వ్యాపారి సుధీర్ జైన్కు చెందినవి. ఆయన ప్రతిరోజూ ఈ కలశాలను పూజల కోసం తీసుకొచ్చేవారు. దొంగ జైన సన్యాసి వేషంలో వచ్చి, నిర్వాహకులు అతిథుల రాక కోసం ఏర్పాట్లలో బిజీగా ఉన్న సమయంలో ఈ చోరీకి పాల్పడ్డాడు. సుమారు 760 గ్రాముల బంగారంతో తయారై, 150 గ్రాముల వజ్రాలు, రూబీలు, పచ్చలతో అలంకరించబడిన ఈ కలశాలను ఒక సంచిలో వేసుకుని దొంగ జారుకున్నాడు.
పూజా కార్యక్రమాలు మళ్లీ ప్రారంభమైనప్పుడు కలశం కనిపించకపోవడంతో నిర్వాహకులు షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కోట్వాలీ పోలీస్ స్టేషన్లో బీఎన్ఎస్ సెక్షన్ 303(2) కింద కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్లో దొంగ కనిపించాడని, అతడిని గుర్తించామని పోలీసులు తెలిపారు. త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.
సుధీర్ జైన్ మీడియాతో మాట్లాడుతూ, "ఈ కలశాలు మా కుటుంబ సెంటిమెంట్తో ముడిపడి ఉంది. దాని విలువను డబ్బుతో కొలవలేము. అందం కోసం విలువైన రాళ్లు పొదిగించాము. పోలీసులు దొంగను గుర్తించారు, త్వరలో అతడిని పట్టుకుంటారని ఆశిస్తున్నాము" అని అన్నారు. ఈ ఘటన ఎర్రకోట వద్ద భద్రతా లోపాలను మరోసారి బహిర్గతం చేసింది.