Modi-Chandrababu: మోడీ-చంద్రబాబు: ఈ దశాబ్దం మోడీదే: ఏపీ సీఎం చంద్రబాబు
మోడీదే: ఏపీ సీఎం చంద్రబాబు
Modi-Chandrababu: ఈ దశాబ్దం పూర్తిగా ప్రధాని మోడీదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రగతిశీల మార్గంలో ముందుకు సాగుతోందని కొనియాడారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్తో పాటు అధికార కూటమి అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తానని తెలిపారు.
కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం సామాన్య ప్రజల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని సంస్కరణలు అమలు చేస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ డబుల్ ఇంజన్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తిగా పూర్తి చేసే ముందే ఎన్నికల మేనిఫెస్టోలోని ‘సూపర్ సిక్స్’ హామీలను విజయవంతంగా అమలు చేస్తోందని వెల్లడించారు. ‘‘భారత్లో అనేక ఆసక్తికర అంశాలు ఏర్పడుతున్నాయి. ప్రధాని మోడీ 2000 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఎన్నికల్లో విజయం సాధిస్తూనే ఉంటారు. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 11 సంవత్సరాలుగా ప్రధానిగా కొనసాగుతున్నారు. మరో నలభై ఏళ్లు ఆయనే ఉంటారు. ఈ దశాబ్దం పూర్తిగా మోడీదే. అంటే ఆటోమేటిక్గా భారతీయులదే’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల గురించి చంద్రబాబు మాట్లాడారు. ఈ మార్పుల వల్ల ప్రజల ఆదాయాలు పెరిగి సేవింగ్స్ పెరుగుతాయని తెలిపారు. ఎంఎస్ఎంఈలు, ఇతర వ్యాపారులు ఈ మార్పులతో సంతోషిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఏ దేశ తలసరి ఆదాయంలో భారతీయులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని, దుబాయ్ పర్యటనలో భాగంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులు పెంచేందుకు అనేక వ్యాపారవేత్తలతో సమావేశమైనారు. వచ్చే నెలలో విశాఖపట్నంలో జరిగే సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కు ఆహ్వానించారు. అదే రోజుల్లో ఆర్సెలార్మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్కు ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపన జరగనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, వ్యవసాయం, ఉద్యానవనరంగాలు, లాజిస్టిక్స్, రాజధాని అమరావతిలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 750కు పైగా సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తూ రియల్టైమ్ గవర్నెన్స్ను అమలు చేస్తున్నామని వివరించారు. తెలుగు కమ్యూనిటీ గురించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఈ గ్రహంపై అత్యంత ప్రభావవంతమైన సమాజంగా తెలుగు వారు నిలుస్తారని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. గత 15 నెలల్లో తమ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందని, మరో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టేందుకు సిద్ధాలవుతున్నామని చెప్పారు.