దేశానికి వన్నె తెచ్చిన నేత రాజీవ్ గాంధీ
- దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణాలర్పించింది
- రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సీయం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
ప్రధానిగా దేశానికి వన్నె తెచ్చిన మహానాయకుడు రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. బుదరవారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయంలో ఆయన విగ్రహానికి సీయం పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన వర్ధంతి కార్యక్రమంలో సీయం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యువతకు 18 ఏళ్ళకే ఓటు హక్కు కల్పించి ప్రభుత్వాల ఏర్పాటులో యువతకు భాగస్వామ్యం కల్పించారని గుర్తు చేశారు. ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్ధగా నిలబెట్టారని సీయం కొనియాడారు. సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కొందరు విమర్శలు చేశారని, సంకుచిత మనస్తత్వం కలిగిన కొందరు రాజీవ్ గాంధీని విమర్శిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది, కాంగ్రెస్ పార్టీది అని సీయం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పహల్గామ్ ఘన నేపథ్యంలో ఆనాటి ప్రధాని ఇందిరమ్మ ధైర్య, సాహసాలను దేశంలో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్నారని, ఇందిర హయాంలో తీవ్రవాదులు దేశ పౌరులపై దాడులకు తెగబడితే పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చెప్పారని కొనాయాడారు. మా దేశాన్ని మేము రక్షించుకోగలుగుతాము... మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ఇందిరమ్మ ఆనాడే తెగేసి చెప్పిందని అన్నారు. కానీ ప్రస్తుతం పహల్గామ్ ఘటనలో పాకిస్ధాన్కు బుద్ది చెప్పడంలో ప్రధాని వెనకడుగు వేశారని ట్రంప్ చెపితే కాల్పుల విరమణ చేసిన పరిస్ధితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదని సీయం రవంత్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా బీజేపీ నాయకులు తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తు్న్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన సమయంలో కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకుని పడుకున్నారని ఎద్దేవా చేశారు. మేము బయటకి వచ్చి కేంద్రానికి మద్దతు ప్రకటించామన్నారు.