నాంపల్లి కోర్టుకు సీయం రేవంత్ రెడ్డి హాజరు

Update: 2025-05-22 12:26 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. గతంలో తనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల విచారణ నిమిత్తం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు ఇవాళ హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కావడం ఇది రెండోసారి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హైదరాబాద్ బేగంబజార్, నల్గొండ టూ టౌన్, మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల్లో వ్యక్తిగతంగా న్యాయమూర్తి ముందు హాజరైన రేవంత్ రెడ్డి తన వాదనను వినపించారు. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని, పోలీసులు చెబుతున్నవి అవాస్తవాలని కోర్టుకు తెలిపారు. తాను ఎక్కడా ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. ఈ కేసుల్లో జూన్ 12న నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు ప్రకటించనుంది.ముఖ్యమంత్రి కోర్టుకు హాజరుకావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్ దగ్గరకు ఇతరులను అనుమతించలేదు. ఈ కేసులు నమోదైన సమయంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా.. గతంలో కూడా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఏప్రిల్ 2024లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల విచారణ నిమిత్తం ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. ఇది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టుకు హాజరుకావడం రెండోసారి. న్యాయమూర్తి వాంగ్మూలం రికార్డ్ చేసి తీర్పు రిజర్వ్ చేసిన అనంతరం రేవంత్ కోర్టు హాల్ నుంచి వెళ్లిపోయారు.

కాగా, సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు గతంలో పరువు నష్టం దావా వేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఒక కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు బీజేపీ పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంటూ.. కాసం వెంకటేశ్వర్లు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు.కాసం వెంకటేశ్వర్లు తన ఫిర్యాదుతో పాటు, రేవంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లను కోర్టుకు సమర్పించారు. రేవంత్ రెడ్డిపై ఈ కేసు నమోదైన సమయంలో ఆయన తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. రేవంత్ రెడ్డి తనపై నమోదైన ఈ పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చినా.. ట్రయల్ కొనసాగింపును నిలిపివేయడానికి నిరాకరించింది.

Tags:    

Similar News